పాకిస్థాన్ పేసర్ హరిస్ రౌఫ్పై టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సెటైర్లు పేల్చాడు. తిలక్ వర్మ, భారత జట్టు అద్భుత ప్రదర్శన కంటే హరిస్ రౌఫ్ చెత్త బౌలింగ్ కారణంగానే టీమిండియా విజయం సాధించిందని విమర్శలు గుప్పించాడు. ఇందుకు హరిస్ రౌఫ్కు అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా కృతజ్ఞతలు కూడా చెప్పాడు.
ఈ మ్యాచ్లో 3.4 ఓవర్లు వేసిన హరిస్ రౌఫ్ 50 పరుగులు సమర్పించుకున్నాడు. మిగతా బౌలర్లంతా కలిసి 100 పరుగులిస్తే అతనొక్కడే 50 పరుగులు ఇచ్చుకోవడం పాకిస్థాన్ విజయవకాశాలను దెబ్బతీసింది. ఈ మ్యాచ్పై తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా మాట్లాడిన అశ్విన్.. తిలక్ వర్మతో వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. కఠిన సమయంలో తీవ్ర ఒత్తిడిని తట్టుకొని అతను చక్కగా రాణించాడు.

మేం చాలా తేలిగ్గా మ్యాచ్ గెలిచాం. ఇందుకు హరిస్ రౌఫ్కు థ్యాంక్స్ చెప్పాలి. తిలక్ వర్మ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. స్వీప్ షాట్స్ బాగా ఆడాడు. బంతిని గాల్లోకి లేపకుండా నేల మీదుగానే కొట్టి పరుగులు రాబట్టాడు. పిచ్కు తగ్గట్లుగా చాలా తెలివిగా బ్యాటింగ్ చేశాడు. ముఖ్యంగా అతని షాట్ల ఎంపిక అద్భుతం. హరిస్ రౌఫ్ వేసిన ఆఖరి ఓవర్లో తిలక్ వర్మ కొట్టిన సిక్స్ అంత తేలిక కాదు. ఆ షాట్ ఆడటం చాలా కష్టం.
స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తీ, కుల్దీప్ యాదవ్ అద్బుతంగా బౌలింగ్ చేశారు. వారి వల్లే భారత్ ఈ మ్యాచ్పై పట్టు సాధించింది. ఫర్హాన్, ఫకార్ జమాన్ పాకిస్థాన్కు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. అయితే ఆ తర్వాతి బ్యాటర్లు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. పాకిస్థాన్, శ్రీలంక జట్లకు ఉన్న తేడా ఇదే. శ్రీలంక బ్యాటర్లు భారత స్పిన్నర్లను అద్భుతంగా ఎదుర్కొన్నారు. పాక్ బ్యాటర్లతో పోల్చితే వారి షాట్ల ఎంపిక కూడా బాగుంది.'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.