భారత్తో ఆఖరి టెస్ట్లో ఒక్క బంతి కూడా ఎదుర్కోకుండా తనను ఆ దేవుడే రక్షించాడని ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తెలిపాడు. భయంతోనే బ్యాటింగ్ చేశానన్నాడు. ఓవల్ వేదికగా హోరాహోరీగా సాగిన ఆఖరి టెస్ట్లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించి ఐదు టెస్ట్ల సిరీస్ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ క్రిస్ వోక్స్ తీవ్రంగా గాయపడ్డాడు. తొలి ఇన్నింగ్స్లో బౌండరీ లైన్పై బంతిని ఆపేందుకు డైవ్ చేసిన క్రిస్ వోక్స్ భుజానికి తీవ్ర గాయమైంది. దాంతో అతను ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయలేదు. ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ విజయానికి 35 పరుగుల కావాల్సి ఉండగా.. సిరాజ్ అద్భుత ప్రదర్శనతో జెమీ స్మిత, జెమీ ఓవర్టన్లను పెవిలియన్ చేర్చాడు. దాంతో క్రిస్ వోక్స్ బ్యాటింగ్కు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆఖరి వికెట్గా క్రిస్ వోక్స్ క్రీజులోకి రాగా.. గస్ అట్కిన్సన్ స్ట్రైక్ తీసుకున్నాడు. వోక్స్కు బ్యాటింగ్ రాకుండా జాగ్రత్త పడ్డాడు. మరోవైపు ఒంటి చేత్తోనే వోక్స్ క్రీజులో పరుగులు తీసాడు. చివరకు అట్కిన్సన్ను క్లీన్ బౌల్డ్ చేసి సిరాజ్ భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్లో భారత్ గెలిచినా.. గాయంతో బ్యాటింగ్కు దిగిన క్రిస్ వోక్స్పై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది. భారత ఆటగాళ్లు సైతం క్రిస్ వోక్స్ను ప్రత్యేకంగా అభినందించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్రిస్ వోక్స్.. ఒక్క బంతి ఆడకుండా ఆ దేవుడే తనను రక్షించాడని తెలిపాడు. లేకుంటే గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఒక్క చేత్తో ఎదుర్కోవడం తనకు కష్టమయ్యేదని చెప్పాడు.
'ఈ మ్యాచ్లో మేం ఎంత పోరాడినా ఆశించిన ఫలితం దక్కలేదు. నేను బ్యాటింగ్ చేసే సమయంలో బంతిని ఎదుర్కోవాల్సి వస్తే, ఓవర్ పూర్తిగా ఆడాల్సిన పరిస్థితి ఏర్పడితే.. సింగిల్ లేదా, బౌండరీ కొట్టాల్సి వస్తే నా పరస్థితి ఏంది? అనే ఆందోళన కలిగింది. కానీ ఆ దేవుడు నన్నురక్షించాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో వచ్చే బౌన్సర్ను ఒంటి చేత్తో ఆడకుండా కాపాడాడు. నాకు స్ట్రైక్ వచ్చి ఉంటే కొన్ని బౌన్సర్లను ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ ఆందోళనలు బ్యాటర్ను మరింత నిస్సహాయంగా మారుస్తాయి.'అని క్రిస్ వోక్స్ చెప్పుకొచ్చాడు.