
కో సముయ్ (థాయ్లాండ్): ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ హఠాన్మరణంపై థాయ్లాండ్ పోలీసులు జరుపుతున్న విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. షేన్ వార్న్ ఉన్న విల్లా గదిలో ఫ్లోర్తో పాటు టవల్పై రక్తపు మరకల్ని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. థాయ్లాండ్లోని ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ అయిన కో సముయ్కు వెకేషన్కు వెళ్లిన 52 ఏళ్ల వార్న్ శుక్రవారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. వార్న్ అకాల మరణంపై యావత్ క్రీడా ప్రపంచం దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఇక వార్న్ మరణంపై విచారణ జరిపిన థాయ్ లాండ్ పోలీసులు దీన్ని తాము అనుమానాస్పద మృతిగా పరిగణించట్లేదని చెప్పారు.
'గదిలో రక్తపు మరకలుఉన్నాయి. అచేతనంగా పడి ఉన్న వార్న్ను చూసిన అతని ఫ్రెండ్స్ వెంటనే సీపీఆర్ చేశారు. ఆ సమయంలో అతను దగ్గడంతో రక్తం వచ్చింది. ఇటీవలే హార్ట్ చెకప్ కోసం వార్న్ డాక్టర్ను కలిశాడు. దీనిని అనుమానాస్పద మృతిగా భావించట్లేదు'అని పోలీసులు చెప్పుకొచ్చారు. మరోవైపు వార్న్కు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆస్ట్రేలియా ప్రభుత్వం తెలిపింది.
మరణించడానికి ముందు షేన్ వార్న్.. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టును టీవీలో చూసాడని, మద్యం కూడా తీసుకోలేదని అతని మేనేజర్ జేమ్స్ ఎర్స్కిన్ తెలిపాడు. హాలిడే కోసం థాయ్లాండ్ వెళ్లిన వార్న్.. బరువు తగ్గేందుకు డైటింగ్ చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు. 'మ్యాచ్ల కామెంట్రీ కోసం ఇంగ్లండ్ వెళ్లే ముందు దొరికిన సమయాన్ని గడిపేందుకు వార్న్ థాయ్లాండ్కు వచ్చాడు.
మరణానికి ముందు అతను మద్యం తీసుకోలేదు. తన స్నేహితుడు నియోఫిటోను కలిసి భోజనం చేయాలనుకున్నాడు. సాయంత్రం 5 గంటల సమయంలో మరికొంత మందిని వార్న్, నియోఫిటో కలవాలనుకున్నారు. పక్క గదిలోనే ఉన్న నియో వచ్చేసరికి వార్న్ నిర్జీవంగా పడి ఉన్నాడు. అతనికి ఏదో అయిందని నియో భావించాడు. నోటిలో నోరు పెట్టి శ్వాస ఇచ్చేందుకు ప్రయత్నించాడు.
హృదయ స్పందన లేకపోవడంతో సీపీఆర్ చేశాడు. 20 నిమిషాల తర్వాత అంబులెన్స్ వచ్చింది. ఓ గంట తర్వాత వార్న్ చనిపోయాడనే విషయం తెలిసింది. అతన్ని రెండు గంటల ముందు చివరగా చూశా. అతనెక్కువగా మద్యం తాగడం లేదు. బరువు తగ్గేందుకు ఆహార నియమాలు పాటిస్తున్నాడు'' అని సుదీర్ఘ కాలంగా వార్న్ మేనేజర్గా ఉన్న జేమ్స్ చెప్పాడు. మరోవైపు ఆసుపత్రికి తీసుకు వచ్చేలోపే వార్న్ ప్రాణాలు పోయాయని థాయ్ అంతర్జాతీయ ఆసుపత్రి వెల్లడించింది.