Temba Bavuma, IND vs SA: పిచ్ కండిషన్స్కు తగ్గట్లు ఆడకపోవడమే తమ పతనాన్ని శాసించిందని సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా తెలిపాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 243 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. భారత భీకర బౌలింగ్ లైనప్ను ఎదుర్కొనలేక 83 పరుగులకే కుప్పకూలింది.
మ్యాచ్ అనంతరం ఈ ఘోర పరాజయం స్పందించిన టెంబా బవుమా.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని తెలిపాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విఫలమయ్యామని అంగీకరించాడు. 'ఈ మ్యాచ్ మాకు అతి పెద్ద సవాల్ అని తెలుసు. ఎందుకంటే ఇప్పటికే మేం చేజింగ్ చేయలేక ఒక మ్యాచ్లో ఓడిపోయాం. ఈ విషయం గురించి మా బ్యాటర్లతో మేం చర్చించాం.

పవర్ ప్లేలోనే టీమిండియా 90 పరుగులు చేసింది. ఆ తర్వాత మా బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేసి టీమిండియా భారీ స్కోర్కు బ్రేక్ వేసారు. రోహిత్ శర్మ అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తే.. కోహ్లీ, అయ్యర్ దాన్ని కొనసాగిస్తూ.. అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మేం అనుమానించినట్లుగా ఈ వికెట్ ఉంది. కానీ దురదృష్టవశాత్తు మేం పరిస్థితులకు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయాం. మా సామర్థ్యానికి తగినట్లు రాణించలేకపోయాం. సెమీఫైనల్ మ్యాచ్ను కూడా మేం ఇక్కడే ఆడాల్సి వస్తుందనుకుంటా.'అని బవుమా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 326 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(121 బంతుల్లో 10 ఫోర్లతో 101 నాటౌట్) రికార్డు సెంచరీతో చెలరేగగా.. శ్రేయస్ అయ్యర్(87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 77) హాఫ్ సెంచరీతో రాణించాడు.
రబడా, కేశవ్ మహరాజ్, టబ్రైజ్ షంసీ, ఎయిడెన్ మార్క్రమ్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సౌతాఫ్రికా 27.1 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా(5/33) ఐదు వికెట్లతో సఫారీ టీమ్ పతనాన్ని శాసించగా.. మహమ్మద్ షమీ(2/18), కుల్దీప్ యాదవ్(2/7) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్(1/11) ఓ వికెట్ దక్కింది.
సఫారీ బ్యాటర్లలో మార్కో జాన్సెన్(14), వాన్ డెర్ డస్సెన్(13), టెంబా బవుమా(11), డేవిడ్ మిల్లర్(11) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.