సౌతాఫ్రికా వన్డే కెప్టెన్ టెంబా బవుమా చరిత్ర సృష్టించాడు. 27 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్గా నిలిచాడు. మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆతిథ్య ఇంగ్లండ్తో లార్డ్స్ వేదికగా గురువారం ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో సౌతాఫ్రికా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సౌతాఫ్రికా 2-0తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. అప్పుడెప్పుడో 1998లో ఇంగ్లండ్ గడ్డపై సౌతాఫ్రికా వన్డే సిరీస్ గెలిచింది. హన్సీ క్రోంజ్ సారథ్యంలో ఈ విజయాన్నందుకుంది. అప్పటి నుంచి ఇంగ్లండ్ గడ్డపై సౌతాఫ్రికా వన్డే సిరీస్ గెలవలేదు. కానీ తాజా సిరీస్ను మాత్రం మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
గురువారం ఉత్కంఠగా సాగిన రెండో వన్డేలో బౌలర్ల అసాధారణ ప్రదర్శనతో సౌతాఫ్రికా గెలుపొందింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 330 పరుగులు చేసింది. మాథ్యూ బ్రిట్జ్కీ(77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్లతో 85), ట్రిస్టన్ స్టబ్స్(62 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 58) హాఫ్ సెంచరీలతో రాణించగా.. ఎయిడెన్ మార్క్రమ్(49), డెవాల్డ్ బ్రెవిస్(42) కీలక ఇన్నింగ్స్ ఆడారు.

ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(4/62) నాలుగు వికెట్లు తీయగా.. ఆదిల్ రషీద్(2/33) రెండు వికెట్లు పడగొట్టాడు. జాకోబ్ బెతెల్(1/61) ఒక వికెట్ తీసాడు. అనంతరం ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 325 పరుగులు చేసింది. జో రూట్(72 బంతుల్లో 8 ఫోర్లతో 61), జోస్ బట్లర్(51 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 61), జాకోబ్ బెతెల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లతో 58) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లో నండ్రే బర్గర్(3/63) మూడు వికెట్లు తీయగా.. కేశవ్ మహరాజ్(2/59) రెండు వికెట్లు పడగొట్టాడు. లుంగి ఎంగిడి, కార్బినో బోచ్, సెనరన్ ముతుసామి చెరో వికెట్ పడగొట్టారు.
ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. ముతుసామి కట్టడిగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఆర్చర్ రెండు బౌండరీలు బాదినా ఫలితం లేకపోయింది.