ప్రొకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 2025 సీజన్లో తెలుగు టైటాన్స్ ఎట్టకేలకు బోణీ చేసింది. వరుసగా రెండు పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది. గురువారం వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37-32 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ను ఓడించింది. కెప్టెన్ విజయ్ మాలిక్(8), ఆల్రౌండర్ భరత్(8) అసాధారణ ప్రదర్శనతో తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఇద్దరికి తోడుగా రైడర్ చేతన్ సాహు(5), డిఫెండర్ అజిత్ పవర్(5) రాణించాడు. జైపూర్ పింక్ పాంథర్స్ నితిన్ కుమార్ 13 పాయింట్స్తో రాణించిన ఫలితం లేకపోయింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో విజయ్ మాలిక్, భరత్ అసాధారణ ప్రదర్శనతో తెలుగు టైటాన్స్కు విజయాన్నందించారు.
మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రైడింగ్, ట్యాక్లింగ్తో వరుస పాయింట్స్ సాధించింది. జైపూర్ పింక్ పాంథర్స్ ప్రతిఘటించినా.. తెలుగు టైటాన్స్ అవకాశం ఇవ్వలేదు. ప్రత్యర్థిని ఒకసారి ఆలౌట్ చేసిన తెలుగు టైటాన్స్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 16-9తో 7 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. అయితే సెకండాఫ్లో జైపూర్ పింక్ పాంథర్స్ పుంజుకుంది. పోటాపోటిగా పాయింట్స్ రాబట్టడంతో తెలుగు టైటాన్స్ ఆధిక్యం తగ్గింది.

రైడింగ్, ట్యాక్లింగ్లో ఆధిపత్యం చెలాయించిన జైపూర్ పింక్ పాంథర్స్.. తెలుగు టైటాన్స్ను ఆలౌట్ ముంగిట నిలిపింది. కానీ భరత్ సూపర్ రైడ్తో మూడు పాయింట్స్ రాబట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. కానీ ఆ తర్వాత అతను కూడా ఔటవ్వడంతో తెలగుటైటాన్స్ ఆలౌటవ్వడం ఆగలేదు. చివరి ఐదు నిమిషాల్లో మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. భరత్, విజయ్ మాలిక్ అద్భుతంగా ఆడి తెలుగు టైటాన్స్ విజయాన్ని లాంఛనం చేశారు.
ముఖ్యంగా విజయ్ మాలిక్ సూపర్ రైడ్ తెలుగు టైటాన్స్ విజయాన్ని ఖరారు చేసింది. ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ సమష్టిగా రాణించింది. రైడర్స్తో పాటు డిఫెండర్స్ కూడా సత్తా చాటారు. జైపూర్ రైడర్ అలీ సమాధి ట్యాకిల్ ఈ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. మ్యాచ్ ఆరంభంలో తెలుగు టైటాన్స్కు అదృష్టం కూడా కలిసొచ్చింది. లాబీ లైన్ క్రాస్ చేసిన జైపూర్ ప్లేయర్స్ సెల్ఫ్ ఔట్ అయ్యారు.