ఐపీఎల్ 2026 మినీ వేలంలోనూ తెలుగు ప్లేయర్లకు నిరాశే ఎదురైంది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన మినీ వేలంలో 18 మంది ఆటగాళ్లు బరిలో నిలవగా.. ఒకే ఒక్కడికి అవకాశం దక్కింది. హైదరాబాద్కు చెందిన అమన్రావును రాజస్థాన్ రాయల్స్ రూ.30 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది.
ఈ వేలంలో 8 మంది అనామక ఆటగాళ్లను కొనుగోలు చేసిన సన్రైజర్స్ హైదరాబాద్.. తెలుగు ప్లేయర్లను మాత్రం అస్సలు పట్టించుకోలేదు. ఒక్కరిని కూడా తీసుకునే ప్రయత్నం చేయలేదు. తెలుగు యాజమాన్యం కలిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కూడా మన ఆటగాళ్ల వైపు కన్నెత్తి చూడలేదు. దాంతో తెలుగు ప్లేయర్లకు మరోసారి అన్యాయమే జరిగింది. గతంలో అమ్ముడైన ఆటగాళ్లకు కూడా ఈసారి మొండి చెయ్యే ఎదురైంది.

హైదరాబాద్ తరఫున దేశవాళీ క్రికెట్లో రాణిస్తున్న రాహుల్ బుద్ధి, తనయ్ త్యాగరాజన్, ఆరోన్ జార్జి వర్గీస్, రక్షణ్ రెడ్డి, మనీశ్ రెడ్డి, నిశాంత్ శరణు, అర్ఫాజ్ మహమ్మద్, నితిన్ సాయి యాదవ్, చామ మిలింద్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. రూ.30 లక్షల కనీస ధరతో తీసుకునేందుకు కూడా ఆసక్తి చూపించలేదు.
ఆంధ్ర వెటరన్ వికెట్ కీపర్ కేఎస్ భరత్కు ఈ సారి కూడా నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల కనీస ధరతో ఉన్న ఈ తెలుగు వికెట్ కీపర్ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. అతనితో పాటు రికీ భుయ్, సత్యనారయణ రాజు, యర్ర పృథ్వీ రాజ్, బైలాపుడి యశ్వంత్, ధీరజ్ కుమార్, మారం రెడ్డి హేమంత్ రెడ్డి, సాధిఖ్ హుస్సేన్లకు నిరాశే ఎదురైంది. తెలుగు ప్లేయర్లకు అవకాశం ఇవ్వకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై మండిపడుతున్నారు. తెలుగు ఫ్రాంచైజీలో తెలుగు ప్లేయర్లకు అవకాశం ఇవ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సలీల్ అరోరా(రూ.1.50 కోట్లు), శివాంగ్ కుమార్(రూ.30 లక్షలు), క్రెయిన్స్ ఫులెట్రా(రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్(రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలె(రూ.30 లక్షలు), ప్రఫుల్ హింగే(రూ.30 లక్షలు), అమిత్ కుమార్(రూ.30 లక్షలు), లియామ్ లివింగ్ స్టోన్(రూ.13 కోట్లు), శివమ్ మావి(రూ.75 లక్షలు), జాక్ ఎడ్వర్డ్స్(రూ.3 కోట్లు).