మహిళల వన్డే ప్రపంచకప్ 2025 బరిలోకి దిగే భారత జట్టును బీసీసీఐ మహిళల సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. మంగళవారం బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో భారత మహిళల చీఫ్ సెలెక్టర్ నీతూ డేవిడ్.. హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని 15 మంది సభ్యుల జట్టు వివరాలను చీఫ్ వెల్లడించారు. ఈ సమావేశంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా పాల్గొంది. మెగా టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్ ఆడే భారత జట్టు వివరాలను కూడా ఈ సమావేశంలోనే ప్రకటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి భారత్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ జరగనున్న విషయం తెలిసిందే.
ఈ టోర్నీకి సన్నాహకంగా సెప్టెంబర్ 14, 17, 20 తేడీల్లో ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ను హర్మన్ సేన ఆడనుంది. వన్డే ప్రపంచకప్లో హర్మన్ప్రీత్ కౌర్కు స్మృతి మంధాన డిప్యూటీగా వ్యవహరించనుంది. ఈ జట్టులో తెలుగు తేజాలు అరుంధతి రెడ్డి, శ్రీ చరణి చోటు దక్కించుకున్నారు.

కడపకు చెందిన నల్లపురెడ్డి శ్రీ చరణి లెఫ్టార్మ్ స్పిన్నర్గా రాణిస్తోంది. ఈ ఏడాదే అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన నల్లపురెడ్డి శ్రీ చరణి మెరుగైన ప్రదర్శనతో ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకుంది. హైదరాబాద్కు చెందిన అరుంధతి రెడ్డి సీనియర్ ప్లేయర్. లేడీ సెహ్వాగ్గా గుర్తింపు పొందిన షెఫాలీ వర్మపై సెలెక్టర్లు వేటు వేసారు. స్మృతి మంధానకు జోడీగా ప్రతికా రావల్ రాణిస్తుండటంతో షెఫాలీపై వేటు పడింది.
గతేడాది అక్టోబర్లో న్యూజిలాండ్తో షెఫాలీ ఆఖరి వన్డే ఆడింది. పేలవ ఫామ్తో జట్టులో ఆమె చోటు కోల్పోగా.. అవకాశం అందుకున్న ప్రతికా రావల్ మెరుగైన ప్రదర్శన చేసి స్థానాన్ని పదిలం చేసుకుంది. వెన్ను నొప్పి గాయంతో గతేడాదిగా జట్టుకు దూరంగా ఉన్న రేణుకా సింగ్ రీ ఎంట్రీ ఇచ్చింది. ఆస్ట్రేలియాతో సిరీస్కు ఇదే జట్టును కొనసాగించిన సెలెక్టర్లు ఒకే ఒక్క మార్పు చేశారు. అమంజోత్ కౌర్ స్థానంలో సయాలి సత్ గరేను ఎంపిక చేశారు.
హర్మన్ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్-కెప్టెన్), ప్రతిక రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమన్జోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యస్తిక భాటియా (వికెట్ కీపర్), మరియు స్నేహ్ రాణా
స్టాండ్-బై: తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, ఉమా చైత్రీ, మిన్ను మణి, సాయాలి సాఠ్గరే