న్యూఢిల్లీ: ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నీలో పాల్గొనే భారత్-ఏ జట్టును బీసీసీఐ ప్రకంటించింది. 15 మంది సభ్యులతో కూడిన జట్టు వివరాలను మంగళవారం ప్రకంటింది. ఈ జట్టులో ఆంధ్ర పేసర్, సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నితీశ్ కుమార్ రెడ్డికి చోటు దక్కింది.
శ్రీలంక వేదికగా జులై 13 నుంచి 23 వరకు ఈ టోర్నీ జరగనుంది. ఇప్పటి వరకు 10 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన నితీశ్ కుమార్ రెడ్డి 27 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2023 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున రెండు మ్యాచ్లు ఆడాడు. దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండటంతో జూనిల్ సెలెక్షన్ కమిటీ నితీశ్ కుమార్కు అవకాశం కల్పించింది.

భారత్-ఏ జట్టుకు యశ్ ధూల్ కెప్టెన్గా వ్యవహరించనుండగా.. అభిషేక్శర్మ వైస్ కెప్టెన్గా కొనసాగనున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డితో పాటు ఐపీఎల్ ప్లేయర్లు సాయి సుదర్శన్, రియాన్ పరాగ్, ప్రభ్సిమ్రన్ సింగ్, ధ్రువ్ జురెల్, హర్షిత్ రాణా, ఆకాశ్ సింగ్, రాజ్యవర్థన్లు ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.
మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి ఈ టోర్నీలో ఆడనున్నాయి. గ్రూప్-బిలో నేపాల్, యూఏఈ, పాకిస్థాన్తో కలిసి భారత్ ఆడుతుండగా.. గ్రూప్-ఏలో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, ఒమన్ తలపడనున్నాయి. జులై 13న యూఏఈతో తొలి మ్యాచ్ ఆడే భారత్.. 15న పాకిస్థాన్, 18న నేపాల్తో ఆడనుంది.
భారత్-ఏ జట్టు:
సాయి సుదర్శన్, యశ్ ధూల్ (కెప్టెన్), అభిషేక్శర్మ (వైస్ కెప్టెన్), నితీశ్కుమార్ రెడ్డి, నికిన్ జోస్, ప్రభోద్ పాల్, రియాన్ పరాగ్, నిశాంత్, ప్రభ్సిమ్రన్ సింగ్, ధ్రువ్ జురెల్, మానవ్ సతార్, యువరాజ్ సిన్ దోదియా, హర్షిత్ రాణా, ఆకాశ్ సింగ్, రాజ్యవర్దన్;
స్టాండ్బై: హర్ష్ దూబె, నేహల్ వదెరా, స్నెల్ పటేల్, మోహిత్ రేద్కర్.