తొమ్మిది నెలల క్రితం కరేబియన్ గడ్డపై టీ20 ప్రపంచకప్ 2024 అందుకున్న టీమిండియా.. ఇప్పుడు అరబ్ గడ్డపై మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అన్ని విభాగాల్లో అదరగొడుతూ.. అసాధారణ ప్రదర్శనతో సత్తా చాటుతూ ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. మెగా టోర్నీలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో అత్యధికంగా మూడోసారి టైటిల్ నెగ్గి తీన్మార్ కొట్టింది. విశ్వవేదికపై మువ్వెన్నెల జెండాను మరోసారి రెపరెపలాడించింది.
ఆదివారం జరిగిన ఉత్కంఠపోరులో అద్వితీయమైన ప్రదర్శనతో టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను ఓడించింది. ఏ ఒక్కరి ప్రదర్శనపైనో ఆధారపడకుండా సమష్టిగా రాణించి టీమిండియా ఈ టైటిల్ గెలవడం గమనార్హం. అయితే భారత్ విజేతగా నిలిచినా.. ఈ జట్టులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు లేరనే లోటు తెలుగు అభిమానులను వెంటాడుతోంది. టీ20 ప్రపంచకప్ 2024 విజయంలో భాగమైన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఈ జట్టులో చోటు దక్కని విషయం తెలిసిందే.

తెలుగు ప్లేయర్లు లేరు కానీ..
అయితే ఈ జట్టులో తెలుగు ఆటగాళ్లు లేకున్నా.. ఈ విజయంలో ఇద్దరూ తెలుగు వ్యక్తులు భాగంగా ఉన్నారు. అందులో ఒకరు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ అయితే.. మరొకరు టీమిండియా మేనేజర్ ఆర్ దేవ్రాజ్. ప్రత్యక్షంగా జట్టు విజయంలో భాగం కాకపోయినా.. ఈ ఇద్దరూ తెలుగు వ్యక్తులు పరోక్షంగా భారత్ విజయానికి కృషి చేశారు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టుకు కూడా టీ దిలీప్ ఫీల్డింగ్ కోచ్గా వ్యవహరించారు. ఆర్ శ్రీధర్ తర్వాత టీమిండియా ఫీల్డింగ్ కోచ్గా బాధ్యతలు చేపట్టిన దిలీప్.. జట్టు ఫీల్డింగ్లో అనేక మార్పులు తీసుకొచ్చారు.

ఫీల్డింగ్ అవార్డులతో..
ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ 2023 సమయంలోనే టీమిండియా బెస్ట్ ఫీల్డర్ అవార్డ్ను ప్రవేశపెట్టి ఆటగాళ్లలో పోటీ తత్వాన్ని పెంచాడు. ఆ అవార్డ్స్ వినూత్న రీతిలో అందజేస్తూ అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియా ఫీల్డింగ్ కాస్త పేలవంగా ఉన్నా.. కొన్ని క్యాచ్లు, రనౌట్స్ ప్రత్యర్థుల పతనాన్ని శాసించాయి. దిలీప్.. తెలంగాణలోని వరంగల్కు చెందిన వ్యక్తి కావడంతో తెలుగు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తల్లి మరణించినా..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) సెక్రటరీ అయిన దేవ్రాజ్ను బీసీసీఐ.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా మేనేజర్గా ఎంపిక చేసింది. టీమ్ మేనేజర్గా.. ఆటగాళ్లకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా దేవ్రాజ్ చూసుకున్నారు. ఈ టోర్నీ మధ్యలో తన తల్లి మరణించినా.. హైదరబాద్కు వచ్చి ఆమె అంత్యక్రియలను పూర్తి చేసి వెంటనే దుబాయ్కు వెళ్లిపోయారు. జట్టు కోసం మేనేజర్గా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి భారత విజయంలో భాగమయ్యారు. దేవ్ రాజ్ కమిట్మెంట్ను హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు కొనియాడారు. టీమిండియా విజయం సాధించిన వెంటనే జట్టుకు అభినందనలు తెలుపుతూ ఓ ప్రకటనను విడుదల చేశారు.