పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 షెడ్యూల్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఆతిథ్య దేశమైన భారత్ను ప్రతిపాదిత షెడ్యూల్ను పంపించాలని ఆదేశించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 6 నుంచి మార్చి 8 వరకు టీ20 ప్రపంచకప్ 2026 జరగనుంది. భారత్తో పాటు శ్రీలంక ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. పాకిస్థాన్ తుది పోరుకు అర్హత సాధిస్తే.. ఫైనల్ కూడా శ్రీలంక వేదికగానే జరగనుంది.
ఈ మెగా టోర్నీకి ఆతిథ్య వేదికలుగా అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, ముంబై నగరాలను బీసీసీఐ షార్ట్లిస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో వేదికగా 6 మ్యాచ్లు జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ తమ ప్రతిపాదిత షెడ్యూల్లో చేర్చినట్లు సమాచారం. శ్రీలంకలోని కొలంబో, పల్లెకెలె, గాలే వేదికగా టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లు జరగనున్నాయి.

అయితే టీ20 ప్రపంచకప్ 2026 వేదికల విషయంలో తెలుగు రాష్ట్రాలకు మరోసారి అన్యాయమే జరిగినట్లు అర్థమవుతుంది. బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసిన జాబితాలో వైజాగ్, హైదరాబాద్ నగరాలు లేకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సౌతిండియా నుంచి చెన్నై ఒక్క నగరాన్నే ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు అంతర్జాతీయ మ్యాచ్లు కేటాయించకపోవడాన్ని తప్పుబడుతున్నారు. మైదానాల కేటాయింపులో రొటేషన్ పాలసీని పాటిస్తామని చెప్పే బీసీసీఐ.. అహ్మదాబాద్, చెన్నై, ముంబై నగరాలకు మాత్రం ఇలాంటి రూల్స్ను వర్తింపచేయదని మండిపడుతున్నారు. బీసీసీఐలో గుజరాత్, ముంబైదే పూర్తి పెత్తనంగా మారిందని మండిపడుతున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో నెలకొన్న గొడవలు కూడా మ్యాచ్లు కేటాయించకపోవడానికి కారణంగా మారిందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. వైజాగ్లో మ్యాచ్లు కేటాయించేలా బీసీసీఐ ఒత్తిడి తేవాలని ఆంధ్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను తెలుగు క్రికెట్ అభిమానులు కోరుతున్నారు. మహిళల ప్రపంచకప్ మ్యాచ్లు కేటాయించడం వెనుక నారా లోకేష్ ఉన్నారని, పురుషుల మ్యాచ్లు కూడా జరిగేలా చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.