
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నేడు(గురువారం) 41వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా యావత్ క్రికెట్ ప్రపంచం మహేంద్రుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. ట్విటర్, ఫేస్బుల్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చూసినా ధోనీ నామస్మరణతో మారుమోగుతోంది. సినీ, రాజీకీయ, క్రీడా, వ్యాపార ప్రముఖలంతా మహేంద్రుడికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగు అభిమానులు ఒక అడుగు ముందుకేసి ధోనీకి స్పెషల్ బర్త్డే గిఫ్ట్ అందించారు. ధోనీ 41 జన్మదినం సందర్భంగా 41 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేసి మాజీ కెప్టెన్పై తమకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు. ధోనీ తెలుగు ఫ్యాన్స్ అసోసియేషన్ విజయవాడ (ఆంధ్రప్రదేశ్) నందిగామలో ఈ భారీ కటౌట్ ఏర్పాటు చేసింది. కటౌట్లో ధోనీ సిగ్నేచర్ హెలికాప్టర్ షాట్ ఆడుతున్నట్టు ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ కటౌట్కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
ఈ కటౌట్ను అంబారుపేట గ్రామానికి చెందిన భువన్ చారీ, భారత్, సాయి, సిద్దు,బెనాకర్ సహా మరికొందరు ధోనీ అభిమానులు ఏర్పాటు చేశారు. తమకు ఎంతో ఇష్టమైన క్రికెటర్ ధోనీ పుట్టిన రోజున 41అడుగుల కటౌట్ తో పాటు 41కేజీల కేక్ను కట్ చేశామని తెలిపారు. జాతీయ రహదారి పక్కనే ఏర్పాఉట చేయడంతో ధోనీ 41 అడుగుల కటౌట్ వాహనదారులను ఆకట్టుకుంటుంది.
ధోనీ కటౌట్ పెట్టడం ఇదే తొలిసారి కాదు.. తొలుత 2018లో కేరళలో 35 అడుగులు కౌటౌట్ను, చెన్నైలో 30 అడుగుల కటౌట్ ఏర్పాటు చేయగా..తాజాగా ఇప్పుడూ ధోనీ 41వ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో 41 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఇక మహేంద్ర సింగ్ ధోనీ తన 41 బర్త్డే వేడుకులను లండన్లో జరుపుకున్నాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుకలు జరగ్గా.. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ హాజరయ్యాడు.