
లండన్: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉంది. అనేక సందర్భాల్లో ఈ విషయం స్పష్టమైంది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా మన మెగాస్టార్కు వీరాభిమాని అట. ఆయన పాటలకు విరాట్ చిందేసేవాడట. ఈ విషయాన్ని కోహ్లీ చిన్ననాటి స్నేహితుడు, తెలుగు క్రికెటర్ ద్వారక రవితేజ తెలిపాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీని కలుసుకున్న అతను ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ఈ ఫొటోలకు క్యాప్షన్గా కోహ్లీతో తనకు ఉన్న అనుబంధాన్ని వివరించాడు. ఈ క్రమంలోనే తమ ఇద్దరి మధ్య మెగాస్టార్ చిరంజీవి ఎలా కామన్ పాయింట్గా నిలిచాడో తెలిపాడు.
'సుమారు 6 ఏళ్ల తర్వాత మేము మళ్లీ కలుసుకున్నాం. వెంటనే విరాట్ ఏ చిరు ఎలా ఉన్నావు? అంటూ ఆప్యాయంగా పలకరించాడు. అండర్-15లో మేం రూమ్మేట్స్గా ఉన్నప్పుడు నేను ఎక్కువగా టీవీలో చిరంజీవి సాంగ్స్ను చూసేవాడిని. అప్పుడు కోహ్లీ ఆ పాటలకు తెగ డ్యాన్స్ వేసేవాడు. అప్పటి నుంచి మేము మా అసలైన పేర్లతో పిలుచుకోం. ఒకరినొకరు చిరు అని పిలుచుకుంటాము. ఆ మధుర జ్ఞాపకాలు.. ఇన్నాళ్లైనా అలానే ఉన్నాయి. ఏదీ మారలేదు. నిన్ను చూడటం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే మళ్లీ మనం కలుస్తాం అని ఆశిస్తున్నాను చిరు" అంటూ రవితేజ ఇన్స్టాలో రాసుకొచ్చాడు.
కాకినాడకు చెందిన రవితేజ.. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్లో మేఘాలయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన రవితేజ 2008-13 వరకు 32 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 375 పరుగులు చేశాడు. డెక్కన్ చార్జర్స్తో పాటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. భారత అండర్ 19 జట్టు తరఫున కూడా రవి తేజ ఆడాడు. అండర్ 15 ఆడే రోజుల్లో రవితేజ, కోహ్లీ ఒకే రూమ్ లో ఉండేవారు. ఈ కాకినాడ కుర్రోడికి మామూలుగానే చిన్నప్పట్నుంచే చిరంజీవి ఫీవర్ అంటుకుంది. అప్పట్నుంచి మెగాస్టార్ అంటే అభిమానం పెంచుకున్నాడు. ఆ క్రమంలో కోహ్లీతో కలిసిఉన్న రోజుల్లో మెగాస్టార్ పాటలు పెట్టుకుని డాన్స్ చేసేవాడు. అలా కోహ్లీ కూడా 'చిరు అభిమాని' అయిపోయాడు.