హైదరాబాద్: తెలుగు క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ త్రో డౌన్ స్పెషలిస్ట్ సోముదల ఈశ్వర రావు అకాల మరణం చెందాడు. 40 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో తనవు చాలించాడు. స్నేహితులతో కలిసి సరదాగా బయటకు వెళ్లి వచ్చిన అతను.. బైక్ స్టాండ్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.
గుండెపోటుతో అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన సోముదల ఈశ్వర్.. టీమిండియాకు ఆడాలనే లక్ష్యంతో క్రికెట్ను కెరీర్గా ఎంచుకున్నాడు. కడు పేదరికంలో జన్మించిన ఈశ్వర్.. 10వ తరగతి పూర్తయిన అనంతరం క్రికెట్పై పూర్తి ఫోకస్ పెట్టాడు. స్థానిక టోర్నీల్లో సత్తా చాటాడు.

బౌలర్ అయిన ఈశ్వర్.. తెలుగు వెటరన్ ప్లేయర్ వేణుగోపాల్ రావుతో కలిసి రంజీ ట్రోఫీ సెలెక్షన్స్లో కూడా పాల్గొన్నాడు. వేణుగోపాల్ రావు.. రంజీల్లో ఆడి ఆ తర్వాత టీమిండియాకు ఆడితే.. ఈశ్వర్ మాత్రం జట్టుకు ఎంపిక కాలేక నెట్ బౌలర్గా మారాడు. వైజాగ్ వేదికగా భారత్ ఆడిన అనేక మ్యాచ్ల్లో ఈశ్వర్ నెట్ బౌలర్గా సేవలందించాడు.
140 కిలోమీటర్లతో నిలకడగా బౌలింగ్ చేసే ఈశ్వర్.. దిగ్గజ బ్యాటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, దినేశ్ కార్తీక్లతో పాటు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీలకు నెట్స్లో బౌలింగ్ చేశాడు. అనంతరం త్రో డౌన్ స్పెషలిస్ట్గా మారిన ఈశ్వర్.. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్కు పనిచేస్తున్నాడు.
ఈశ్వర్ రావు అకాల మరణం గురించి తెలుసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తమ అధికారిక ట్విటర్ వేదికగా ఈశ్వర్ రావు ఫొటోను షేర్ చేస్తూ సంతాపం తెలియజేసింది.
'మా ట్రైనింగ్ సెషన్స్, మ్యాచ్ల్లో ఇక నుంచి ఒకరు ఉండరనే విషయాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. మా సైడ్ ఆర్మ స్పెషలిస్ట్ ఈశ్వర్ రావు ఇక లేరు. ఈ కఠిన సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం.'అని ఢిల్లీ క్యాపిటల్స్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ను రీట్వీట్ చేసిన ఐపీఎల్.. ఈశ్వర్ రావు టీమిండియాకు నెట్ బౌలర్గా సేవలందించాడని గుర్తు చేసింది.
ఈశ్వర్ భౌతిక కాయాన్ని దర్శించుకొని నివాళులర్పించిన టీమిండియా వికెట్ కీపర్ శ్రీకర్ భారత్.. అతనితో ఉన్న జ్ఞాపకాలను నెమరవేసుకున్నాడు.
'ఈశ్వర్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు అతను నెట్ బౌలర్గా ఉన్నాడు. అతని బౌలింగ్లో బ్యాటింగ్ చేయడం చాలా ఆస్వాదించేవాడిని. ఈశ్వర్ ఇంత త్వరగా అందర్నీ వదిలి వెళ్తాడని అస్సలు ఊహించలేదు.'అని శ్రీకర్ భరత్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశాడు.