వివాదాస్పదంగా మారిన ఐపీఎల్ 2025 టికెట్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)ను దోషిగా తేల్చారు. అదనపు టికెట్ల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యంపై హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు, సెక్రటరీ ఒత్తిడి చేశారని, బ్లాక్మెయిల్ చేయడం కూడా నిజమేనని విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ విచారణకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందజేశారు. హెచ్సీఏపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి సూచించారు.
ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభంలో ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ల టికెట్లలో తమకు అదనపు టికెట్లు ఇవ్వాలని హెచ్సీఏ బెదిరింపులకు పాల్పడుతోందని, ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం లేఖ రాయడం సంచలనం రేపింది. ఇలా బెదిరింపులకు పాల్పడితే హైదరాబాద్ను విడిచి వెళ్లిపోతామని కూడా సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం హెచ్చరించింది. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో విచారణ చేపట్టిన అధికారులు.. తమ ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీపై హెచ్సీఏ సెక్రెటరీ, ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చినట్లు నివేదికలో విజిలెన్స్ అధికారులు పేర్కొన్నారు. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు స్పష్టం చేశారు.
అసలు గొడవ ఏంటంటే..?
నిబంధనల ప్రకారం 10 శాతం టికెట్లు ఇస్తున్నా.. అదనంగా మరో 10 శాతం టికెట్లు కావాలని హెచ్సీఏ కోరింది. అందుకు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అంగీకరించలేదు. అయితే ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహర్ రావు విజ్ఞప్తి చేయగా.. సన్రైజర్స్ యాజమాన్యం అంగీకరించింది. అయితే తనకు వ్యక్తిగతంగా మరో 10 శాతం టికెట్లను ఓపెనర్ మార్కెట్లో ఇవ్వాలని జగన్మోహన్ రావు సన్రైజర్స్ హైదరాబాద్పై ఒత్తిడి చేశారని, అందుకు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అంగీకరించలేదని వార్తలు వచ్చాయి.
కాంప్లిమెంటరీ బాక్స్ టికెట్ల విషయంలో తమ వాటా ఇవ్వలేదని ఆరోపిస్తూ హెచ్సీఏ.. లక్నో మ్యాచ్ సందర్భంగా వీఐపీ బాక్స్లకు తాళాలు వేసింది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్సీఏకు లేఖ రాసింది. ఆ లెటర్ కాస్త మీడియాకు లీకవ్వడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఓవైపు విజిలెన్స్ విచారణ జరుగుతుండగానే.. సన్రైజర్స్ యాజమాన్యం, హెచ్సీఏ చర్చలు జరపుకొని సమస్యను పరిష్కరించుకున్నాయి. విజిలెన్స్ విచారణ పూర్తవ్వడంతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా? అనేది చర్చనీయాంశమైంది.