వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) మెగా వేలంలో టీమిండియా పేసర్, తెలంగాణ బిడ్డ అరుంధతి రెడ్డికి జాక్పాట్ ధర లభించింది. న్యూఢిల్లీ వేదికగా గురువారం జరిగిన డబ్ల్యూపీఎల్ మెగా వేలంలో ఈ హైదరాబాద్ పేసర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) రూ.75 లక్షల రికార్డ్ ధరకు కొనుగోలు చేసింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అరుంధతి రెడ్డి కోసం తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్తో పాటు ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్ పోటీ పడింది.
చివరకు ఆర్సీబీ రూ.75 లక్షల ధరకు సొంతం చేసుకుంది. గత మూడు డబ్ల్యూపీఎల్ సీజన్లలో రూ.30 లక్షల కనీస ధరతో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడిన ఈ హైదరాబాద్ పేసర్.. ఇప్పటి వరకు 20 మ్యాచ్లు ఆడి 17 వికెట్లు తీసింది. టీమిండియా కీలక సభ్యురాలైన అరుంధతి రెడ్డి గాయం కారణంగా వన్డే ప్రపంచకప్ 2025 టోర్నీలో ఒక్క మ్యాచ్ ఆడలేదు. కానీ ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యురాలిగా ఉంది. ఎక్స్ట్రా ప్లేయర్గా టీమిండియాకు సేవలందించింది. సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా అద్భుతమైన క్యాచ్లు అందుకుంది. ఈ విజయం నేపథ్యంలోనే అరుంధతి రెడ్డికి రెట్టింపు ధర దక్కింది.

ఆంధ్రప్రదేశ్, కడప జిల్లాకు చెందిన నల్లపురెడ్డి శ్రీచరణికి జాక్పాట్ ధర దక్కింది. రూ.30 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన శ్రీచరణిని తన పాత ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 1.30 కోట్లకు తీసుకుంది. తెలంగాణకు చెందిన గొంగడి త్రిషను చివర్లో కనీస ధర రూ.10 లక్షలకు యూపీ వారియర్స్ కొనుగోలు చేసింది. మమత మడివాళను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.10 లక్షలకు తీసుకోగా.. క్రాంతి రెడ్డిని ముంబై ఇండియన్స్ రూ.10 లక్షలకు కొనుగోలు చేసింది.
తెలంగాణకే చెందిన భవ్య కస్తూరి, సుజాతలకు నిరాశే ఎదురైంది. రూ.10 లక్షల కనీస ధరతో వేలానికి అందుబాటులో ఉన్న ఈ తెలంగాణ ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కే హసిని, లక్ష్మీ ప్రసన్న, సబ్బినేని మేఘన, స్నేహ దీప్తిలను కూడా ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
శ్రీ చరణి(ఢిల్లీ క్యాపిటల్స్)-రూ.1.30 కోట్లు
అరుంధతి రెడ్డి(ఆర్సీబీ)-రూ.75 లక్షలు
గొంగడి త్రిష(యూపీ వారియర్స్)-రూ.10 లక్షలు
మమత మడివాళ(ఢిల్లీ క్యాపిటల్స్)-రూ.10 లక్షలు
క్రాంతి రెడ్డి(ముంబై ఇండియన్స్)-రూ.10 లక్షలు
కే హాసిని, లక్ష్మీ ప్రసన్న, సబ్బినేని మేఘన, స్నేహ దీప్తి, , భవ్య కస్తూరి, సుజాత.