ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాల ప్రకటనకు రంగ సిద్దమైంది. సుప్రీం కోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వి. రామసుబ్రహ్మణ్యం సారథ్యంలోని 12 మంది సభ్యుల సెలెక్షన్ కమిటీ అర్జున, ఖేల్ రత్న, ద్రోణా చార్య, ధ్యాన్ చంద్ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాలను కేంద్ర ప్రభుత్వానికి అందించింది. ఒకటి రెండు మార్పులు మినహా ఇదే జాబితా ఖాయమయ్యే అవకాశం ఉంది.
ఈ నామినేషన్స్లో తెలంగాణ పారా అథ్లెట్, వరంగల్ బిడ్డ దీప్తి జివాంజీకి చోటు దక్కింది. పారిస్ పారాలింపిక్స్లో 400 మీటర్ల పరుగు(టీ20) కేటగిరిలో కాంస్యం గెలుచుకున్న దీప్తిని అర్జున అవార్డ్కు సెలెక్షన్ కమిటీ సిఫార్స్ చేసింది. దీప్తి జివాంజీ ఆసియా పారాలింపిక్స్, వరల్డ్ ఛాంపియన్షిప్స్ల్లో స్వర్ణాలు సాధించింది. దీప్తి జివాంజీతో పాటు మొత్తం 30 మంది సభ్యులు అర్జున్ అవార్డ్కు నామినేట్ అయ్యారు.

ప్రతిష్టాత్మక క్రీడా పురస్కారమైన ఖేల్ రత్నకు భారత పురుషుల హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్తో పాటు పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ను ప్రతిపాదించారు. పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల టీమ్ కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. టోక్యో ఒలింపిక్స్లోనూ భారత హాకీ టీమ్ కాంస్య పతకం సాధించింది. ఈ రెండు విజయాల్లో 28 ఏళ్ల హర్మన్ప్రీత్ కౌర్ కీలక పాత్ర పోషించాడు.
ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఛాంపియన్స్ ట్రోఫీల్లో భారత హాకీ టీమ్ పతకాలు గెలవడంలోనూ హర్మన్ ప్రీత్ కీలకంగా వ్యవహరించాడు. పారిస్ పారాలింపిక్స్ హైజంప్(టీ64 క్లాస్)లో ప్రవీణ్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. 2020 టోక్యో ఒలింపిక్స్లోనూ ప్రవీణ్ ఇదే విభాగంలో కాంస్య సాధించాడు.
పారిస్ ఒలింపిక్స్లో రెండు కాంస్యాలు సాధించిన షూటర్ మనూ భాకర్ను ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్కు నామినేట్ చేయకపోవడం చర్చనీయాంశమైంది. ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన అథ్లెట్గా మరో చర్చ లేకుండా ఖేల్ రత్న అవార్డుకు ఆమె అర్హురాలు. కానీ ఈ అవార్డు కోసం మనూ భాకర్ దరఖాస్తు చేసుకోలేదని క్రీడా మంత్రిత్వశాఖ వర్గాలు పేర్కొన్నాయి. కానీ మనూ భాకర్ తండ్రి రామ్ కిషన్ ఈ వాదనను ఖండించాడు. తాను సరైన ఫార్మాట్లోనే దరఖాస్తు చేసానని స్పష్టం చేశారు. దరఖాస్తు చేయకపోయినా.. ప్రదర్శనను బట్టి అవార్డుకు ఎంపిక చేసే అధికారం జ్యూరీకి ఉంది.