సే నో టూ' డ్రగ్స్ పేరిట పల్లె క్రికెటర్ల కోసం నిర్వహిస్తున్న తెలుగు ప్రీమియర్ లీగ్(టీపీఎల్) పోస్టర్ను తెలంగాణ క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆవిష్కరించారు. మంగళవారం ఆయన కార్యాలయంలో టీపీఎల్ నిర్వాహకులైన జూపర్ ఎల్ఈడీ సంస్థ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా లీగ్కు సంబంధించిన వివరాలను మంత్రికి వివరించారు.
నిర్వాహకులు ప్రయత్నాన్ని కొనియాడిన మంత్రి.. యువతను మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా చేసే శక్తి క్రీడలకు ఉందని చెప్పారు. క్రీడలతో యువకులను క్రమశిక్షణ, బాధ్యయుత పౌరులుగా మార్చవచ్చని అభిప్రాయపడ్డారు. తద్వారా ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ కూడా అలవడుతుందని చెప్పారు. 'సే నో టూ' డ్రగ్స్ ప్రచారాన్ని యువతలోకి తీసుకెళ్లేందుకు నిర్వహిస్తున్న ఈ టీపీఎల్ విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

అనంతరం లీగ్ నిర్వాహక సంస్థ జూపర్ ఎల్ఈడీ డైరెక్టర్ ఒ.రమేష్ మాట్లాడుతూ.. తమ సీఎస్ఆర్ నిధులతో ఈ పోటీలను నిర్వహిస్తోందని తెలిపారు.ఈ లీగ్ను కేవలం వినోదం కోసం కాకుండా సమాజంలో ఆరోగ్య భద్రత, ఫిట్నెస్, క్రీడలపై అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్నామని తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 60 వేదికల్లో 600 టీమ్లతో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. నాకౌట్ పోటీలకు తెలంగాణ నుంచి 4, ఆంధ్ర నుంచి 4 జట్లు ఎంపిక చేస్తామని అన్నారు. గ్రామీణ క్రికెటర్లకు పెద్ద వేదికలపై క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనేది కూడా తమ ఆలోచన అని తెలిపారు. ఈ టోర్నీ మొత్తం ప్రైజ్ మనీ రూ.80 లక్షలు అని చెప్పారు.