టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న సిరాజ్ను డీఎస్పీని చేశానని గుర్తు చేశారు. సిరాజ్ ఇంటర్ ఫెయిలైనా.. రూల్స్కు విరుద్దమైనా.. వాటిని మార్చి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చానని, డీఎస్పీని చేశానని చెప్పారు.
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్లోని శిల్పకళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి టీచర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్కు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం సిగ్గు చేటన్నారు.

'140 కోట్ల జనాభా ఉన్న భారత్కు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా, అత్యధిక యువకులు ఉన్న భారత్కు ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ రాకపోవడం మనందరికి అవమానం. ఇటీవల సౌత్ కొరియా పర్యటన వెళ్లినప్పుడు అక్కడ 30 ఎకరాల్లో ఉన్న స్పోర్ట్స్ యూనివర్సిటీలో పర్యటించాను. ఒలింపిక్స్లో సౌత్ కొరియా 32 మెడల్స్ గెలిస్తే.. అందులో 16 మెడల్స్ ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులే గెలిచారు.
మన ఉస్మానియా యూనివర్సిటీ 15- 16 వందల ఎకరాల్లో ఉంది. కానీ ఏం లాభం? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ యూనివర్సిటీకి వెళ్లినప్పుడు నాకు స్వాగతం పలికిన ఒక అమ్మాయి.. ఆర్చరీ విభాగంలో మూడు ఒలింపిక్ మెడల్స్ సాధించింది. నాకు స్వాగతం పలికిన అమ్మాయిని నేను సన్మానించాల్సి వచ్చింది. చిన్న దేశం 32 పతకాలు గెలిస్తే.. ఇంత పెద్ద దేశం ఒక్క గోల్డ్ మెడల్ తీసుకురాకపోవడం అవమానం కాదా? అందుకే తెలంగాణలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. టీచర్లందరిని నేను కోరేది ఒక్కటే.. నైపుణ్యం ఉన్న క్రీడాకారులను గుర్తించండి. క్రీడాకారులకు గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తోంది.
నిఖత్ జరీన్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో మెడల్ తెస్తే గ్రూప్ -1 ఉద్యోగంతో నగదు పురస్కారం, ఇంటి స్థలం ఇచ్చాం. క్రికెట్లో రాణించిన సిరాజ్కు డీఎస్పీని చేశాం. ఇంటర్ ఫెయిల్ అయినా.. రూల్స్ మార్చి గ్రూప్-1 ఉద్యోగం ఇచ్చాం. క్రీడల్లో రాణించినందుకే నిఖత్ జరీన్, మహమ్మద్ సిరాజ్లు డీఎస్పీలు అయ్యారు. పారాలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తి జీవాంజికి ఎక్సైజ్ శాఖలో గ్రూప్-2 ఉద్యోగంతో పాటు కోటీ రూపాయలు, వరంగల్లో ఇంటి ప్లాట్ ఇచ్చాం. క్రీడల్లో గ్రామీణ విద్యార్థులను ప్రోత్సహించాలని టీచర్లను కోరుతున్నా. చదువే కాదు.. క్రీడల్లో రాణించినా కూడా భవిష్యత్తు ఉంటుందని పిల్లలకు బోధించండి.'అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.