WTC 2021-23: టీమిండియా షెడ్యూల్ ఇదే.. ఇంగ్లండ్ సిరీస్తోనే షురూ!

న్యూఢిల్లీ: 144 ఏళ్ల టెస్ట్ చరిత్రలో తొలిసారి ఐసీసీ నిర్వహించిన ప్రతిష్టాత్మక వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ను టీమిండియా తృటిలో చేజార్చుకుంది. న్యూజిలాండ్తో జరిగిన మెగా ఫైనల్లో చెత్త బ్యాటింగ్, పేలవ బౌలింగ్తో 8 వికెట్ల తేడాతో ఓడి రన్నరప్గా నిలిచింది. రెండేళ్లపాటు జరిగిన ఈ మెగా టోర్నీలో ఆసాంతరం అదరగొట్టిన కోహ్లీసేన.. కీలక ఫైనల్లో మాత్రం తడబడింది. విలియమ్సన్ సేన అసాధారణ ప్రదర్శన ముందు చేతులేత్తేసింది.
దాంతో మరోసారి కెప్టెన్గా తొలి ఐసీసీ ట్రోఫీని ముద్దాడాలన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ కల నెరవేరలేదు. ఇదిలా ఉండగా, మరో రెండేళ్లలో జరిగే సెకండ్ ఎడిషన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 పోటీలకు టీమిండియా షెడ్యూల్ విడుదలైంది. గతంలో మాదిరే ఈసారి కూడా మూడు విదేశీ పర్యటనలు, మూడు స్వదేశీ సిరీస్లు ఉన్నాయి. అయితే దీన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

ఇంగ్లండ్తోనే షురూ..
ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 14 వరకు ఆతిథ్య జట్టుతో ఐదు టెస్ట్ల సిరీస్ ఆడనుంది. అయితే, మరో రెండేళ్ల పాటు జరిగే సెకండ్ టెస్ట్ చాంపియన్షిప్ పోటీల్లో ఇదే తొలిసిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ కోసం టీమిండియా అన్ని విధాలుగా సమాయత్తం కానుంది. ప్రస్తుతం బ్రేక్లో ఉన్న ఆటగాళ్లు.. బయో బబుల్ వీడి ఇంగ్లండ్ పరిసరాలను ఆస్వాదించనున్నారు. జూలై రెండో వారంలో మళ్లీ బయో బబుల్లో చేరి ఈ ప్రతిష్టాత్మక సిరీస్కు సిద్దం కానున్నారు.

కేన్మామతో మళ్లీ..
భారత జట్టును ఇటీవల కాలంలో పదే పదే సతాయిస్తున్న జట్టు న్యూజిలాండ్. 2019 వన్డే ప్రపంచకప్ సెమీ ఫైనల్లో ఓటమి తర్వాత న్యూజిలాండ్ పర్యటనలోనూ కోహ్లీసేన అటు వన్డే, ఇటు టెస్టు సిరీస్లు కోల్పోయింది. ఇక తాజాగా తొలి ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమిపాలైంది. అంతేకాకుండా 2003 ప్రపంచకప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో కివీస్తో జరిగిన ప్రతీ మ్యాచ్ ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే నవంబర్లో ఆ జట్టు భారత పర్యటనకు రానుంది. అప్పుడైనా టీమిండియా ప్రతీకారం తీర్చుకుంటుందో? లేదా చూడాలి. అయితే, ఈ షెడ్యూల్ తేదీలను ఖరారు చేయలేదు. టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్ వాయిదా పడే అవకాశం కూడా ఉంది.

సౌతాఫ్రికా టూర్..
ఇక టీమింయా న్యూజిలాండ్తో రెండు టెస్టుల సిరీస్ పూర్తయ్యాక ఈ ఏడాది చివర్లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. దాంతో టెస్ట్ చాంపియన్షిప్ పోటీల్లో భాగంగా అక్కడ డిసెంబర్-జనవరి నెలల్లో మూడు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ తేదీలు కూడా ఇంకా ప్రకటించలేదు. వచ్చే ఏడాది ఐపీఎల్ 15వ సీజన్కు ముందు శ్రీలంక భారత పర్యటనకు రానుంది. 2022 ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇరు జట్లూ మూడు టెస్టు మ్యాచ్లు ఆడనున్నాయి. 2022 సెకండాఫ్లో ఆస్ట్రేలియా భారత పర్యటనకు రావాల్సి ఉంది. అప్పుడు నాలుగు టెస్టుల సిరీస్ ఇక్కడే జరగనుంది. ఈ సిరీస్ సెప్టెంబర్-నవంబర్ మధ్య ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంది.

బంగ్లాదేశ్ పర్యటనతో లాస్ట్..
సెకండ్ ఎడిషన్ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పోటీల్లో టీమిండియా చివరగా బంగ్లాదేశ్తో తలపడాల్సి ఉంది. ఒకవేళ నవంబర్లో ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ పూర్తయితే ఆ వెంటనే టీమిండియా బంగ్లా పర్యటనకు వెళ్లనుంది. అక్కడ రెండు టెస్టులు ఆడే అవకాశముంది. ఇవన్నీ టీమిండియా భవిష్యత్ ప్రణాళిక(ఎఫ్టీపీ) ప్రకారం రూపొందించిన సిరీస్లు. అయితే, పరిస్థితుల ప్రభావంతో వీటిలో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. కరోనా, టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ఈ సిరీస్లు జరగవచ్చు.. వాయిదా పడవచ్చు.. రద్దు కూడా కావచ్చు.!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications