
హైదరాబాద్: క్రికెట్లో టాస్ ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాస్ గెలిచిన జట్టుకు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్లో టాస్ ఎంత కీలక పాత్ర పోషించిందో ఫలితాలను చూస్తే అర్థమవుతుంది. ఈ మెగా టోర్నీలో టాస్ గెలిచిన జట్లనే విజయం వరించింది. స్లో పిచ్లు కావడం, విపరీతమైన మంచు ప్రభావం ఉండటంతో మ్యాచ్లన్నీ ఏకపక్షంగా ముగిసాయి. ఫైనల్లో కూడా టాస్ గెలిచిన ఆస్ట్రేలియానే విజయం వరించింది.
ఇక హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియా.. కీలక మ్యాచ్ల్లో టాస్ ఓడి మూల్యం చెల్లించుకుంది. పాకిస్థాన్తో ఫస్ట్ మ్యాచ్, న్యూజిలాండ్తో రెండో మ్యాచ్లో వరుసగా టాస్ కోల్పోయి సెమీస్ చేరకుండా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతేకాదు వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లోనూ టీమిండియా టాస్ ఓడి న్యూజిలాండ్ చేతిలో ఖంగుతిన్నది. ఓ దశలో విరాట్ కోహ్లీ టాస్ గెలవడమే గొప్ప విషయంగా మారిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అయితే టీ20 ప్రపంచకప్ అనంతరం హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ బాధ్యతలు స్వీకరించిన వేళ విశేషమో ఏమో కానీ.. టీమిండియా వరుసగా 8 సార్లు టాస్ గెలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్ట్లో సిరీస్లో కూడా టీమిండియానే మూడింటికి మూడు సార్లు టాస్ గెలిచింది. విరాట్ కోహ్లీ దూరమైన సెకండ్ టెస్ట్లోనూ తాత్కలిక సారథి కేఎల్ రాహుల్ టాస్ గెలిచాడు. అంతకుముందు న్యూజిలాండ్తో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్, మూడు టీ20ల సిరీస్లోనూ టీమిండియా టాస్ గెలిచింది. దాంతో రాహుల్ ద్రవిడ్ రాకతో టీమిండియా దరిద్రం పోయిందని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
తాజాగా సౌతాఫ్రికాతో కేప్టౌన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్లోనూ టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విషయం తెలిసిందే. అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే ఓపెనర్లు కేఎల్ రాహుల్(12), మయాంక్ అగర్వాల్(15) ఔటయ్యారు. దాంతో టీమిండియా 33 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(17 బ్యాటింగ్).. చతేశ్వర్ పుజారా(39 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు నడిపిస్తున్నారు. దాంతో 36 ఓవర్లు ముగిసేసరికి భారత్ 2 వికెట్ల నష్టానికి 91 రన్స్ చేసింది.