మహిళల వన్డే ప్రపంచకప్ 2025 గెలిచి హర్మన్ సేన సరికొత్త చరిత్రను సృష్టించింది. ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి అర్థ శతాబ్దపు కలను సాకారం చేసుకుంది. 1983 వన్డే ప్రపంచకప్ విజయం భారత క్రికెట్ గతిని మార్చినట్టే.. హర్మన్సేన తాజా విజయం మహిళల క్రికెట్ను మరో స్థాయికి చేర్చనుంది. అమ్మాయిల విజయాన్ని యావత్ దేశం సెలెబ్రేట్ చేసుకుంది. చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న భారత మహిళల జట్టుపై సర్వత్రా ప్రశంసల జల్లు కురిసింది.
ప్రధాన నరేంద్ర మోదీ కూడా ఈ విజయాన్ని ప్రశంసించారు. బుధవారం తన నివాసంలో ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టు సభ్యులతో పాటు హెడ్ కోచ్ అమోల్ ముజుందార్తో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై ప్రపంచకప్ విశేషాలను చర్చించారు. ఈ సందర్భంగా అమోల్ ముజుందార్ ప్రధాని మోదీకి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

తమ జట్టుకు ఇంగ్లండ్ కింగ్ ఛార్లెస్-3ని కలిసే అవకాశం వచ్చిందని, కానీ 20 మందికి మాత్రమే అనుమతి ఉండటంతో సపోర్ట్ స్టాఫ్ వెళ్లే అవకాశం లేకపోయిందని గుర్తు చేసుకున్నారు. ఇదే విషయాన్ని అమ్మాయిలకు చెప్పగా.. వారు ఛార్లెస్తో ఫొటో అవసరం లేదని, ప్రపంచకప్ గెలిచి మన ప్రధాని మోదీతో ఫోటో దిగుతామని చెప్పారని అమోల్ ముజుందార్ చెప్పుకొచ్చారు.
'ఈ ఏడాది జూన్లో మేం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాం. అక్కడ ఇంగ్లండ్ కింగ్ చార్లెస్-3ని కలిసాం. ప్రొటోకాల్ ప్రకారం 20 మంది సభ్యులకు మాత్రమే ఈ సమావేశానికి అనుమతించారు. దాంతో కొంత మంది సపోర్ట్ స్టాఫ్ ఈ మీటింగ్కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇదే విషయాన్ని నేను మా జట్టుకు తెలిపాను. 'సారీ.. ప్రోటోకాల్ ప్రకారం 20 మందికి మాత్రమే ఈ సమావేశానికి అనుమతి ఉంది.'అని చెప్పాను. వెంటనే అమ్మాయిలు.. మాకు ఈ ఫొటోగ్రాఫ్ అవసరం లేదు. మేం ప్రధాన మోదీతో నవంబర్ 4, 5న ఫొటో దిగుతామని చెప్పారు. ఈ రోజు అదే జరిగింది.'అని ప్రధాని మోదీ ముందు అమోల్ ముజుందార్ గుర్తు చేసుకున్నారు.
ఈ ప్రపంచకప్ విజయం జట్టు సమష్టిగా సాధించిన విజయమని, జట్టులోని ప్రతీ ఒక్కరు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారని అమోల్ ముజుందార్ చెప్పుకొచ్చారు. భారత్ తరఫున తాను ఒక్క మ్యాచ్ ఆడకపోయినా.. అమ్మాయిల విజయంలో భాగమైనందుకు సంతోషంగా ఉందని తెలిపారు. మోదీతో కలిసి క్షణాలు తమకు మరిచిపోలేని అనుభూతులన్నారు.