ఆస్ట్రేలియా చేతిలో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయిన బాధలో ఉన్న టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి పడిపోయింది. తాజాగా ఐసీసీ ప్రకటించిన టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో 126 రేటింగ్ పాయింట్స్తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. సౌతాఫ్రికా(112) రెండో స్థానంలో నిలిచింది.
ఇక టీమిండియా 109 రేటింగ్ పాయింట్స్తో మూడో స్థానంలో కొనసాగుతోంది. 9 ఏళ్ల తర్వాత ఐసీసీ టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో టీమిండియా మూడో స్థానానికి పడిపోయింది. చివరిగా 2016లో ఈ స్థానంలో నిలిచింది. భారత్పై ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం ఆసీస్కు కలిసి రాగా.. పాకిస్థాన్తో రెండు టెస్ట్ల సిరీస్ను సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది.

ఈ విజయంతో భారత్ను వెనక్కినెట్టి రెండో స్థానంలో నిలిచింది. ఇప్పటికే సౌతాఫ్రికా, ఆసీస్ డబ్ల్యూటీసీ 2025 ఫైనల్ చేరిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్(106), న్యూజిలాండ్(96), శ్రీలంక(87), పాకిస్థాన్(83), వెస్టిండీస్(75), బంగ్లాదేశ్(65), ఐర్లాండ్(26) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.
టీమిండియా గత 8 టెస్ట్ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. మరో మ్యాచ్ను డ్రా చేసుకొని 6 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగిన మూడు టెస్ట్ల సిరీస్లో టీమిండియా అనూహ్యంగా క్లీన్ స్వీప్ అయ్యింది. ఈ సిరీస్ పరాజయం టీమిండియాపై తీవ్ర ప్రభావం చూపింది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశాలను దెబ్బతీసింది.
ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని విజయంతో ప్రారంభించిన టీమిండియా.. ఆ జోరును కొనసాగించలేకపోయింది. పింక్బాల్తో జరిగిన రెండో టెస్ట్లో ఓడిన టీమిండియా.. గబ్బా టెస్ట్లో వర్షం సాయంతో డ్రాతో గట్టెక్కింది. మెల్బోర్న్ టెస్ట్లో తృటిలో డ్రా చేసుకునే అవకాశాన్ని చేజార్చుకొని ఓటమిపాలైంది. చివరి టెస్ట్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్లో 19 మ్యాచ్లు ఆడిన టీమిండియా 9 విజయాలు, 8 ఓటములు, 2 డ్రాలు నమోదు చేసింది. ఈ సైకిల్లో టీమిండియా 50 శాతం విజయాలతో మూడో స్థానంలో నిలిచింది.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 32 వికెట్లతో సత్తా చాటిన టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్కు నామినేట్ అయ్యాడు. అతనితో పాటు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, సౌతాఫ్రికా ప్లేయర్ డ్యాన్ ప్యాటర్సన్ ఈ అవార్డు రేసులో ఉన్నారు.