ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా వ్యాక్సిన్ తొలి డోస్ వేయించుకున్నాడు. కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన ఫొటోను విరాట్.. తన ఇన్స్టా స్టోరీలో అభిమానులతో పంచుకున్నాడు. వీలైనంత త్వరగా ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని పిలుపునిచ్చాడు. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో ముంబైలోని తన ఇంటికి చేరిన విరాట్.. తన సతీమణి అనుష్క శర్మ, కూతురుతో ఈ ఖాళీ సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలోనే బీసీసీఐ సూచన మేరకు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు విరాట్ కోహ్లీ కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నాడు.
Indian captain Virat Kohli has vaccinated. pic.twitter.com/BZdMyItmMW
— Johns. (@CricCrazyJohns) May 10, 2021
రెండు రోజుల క్రితం బీసీసీఐ కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే భారత ఆటగాళ్లంతా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకోవాలని సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. సెకండ్ డోస్ తీసుకునే సమయానికి ఆటగాళ్లంతా ఇంగ్లండ్లో ఉంటారని, కోవాగ్జిన్ తీసుకుంటే అక్కడ అది దొరకదని, అప్పుడు వ్యాక్సిన్ తీసుకొని ఫలితం ఉండదని పేర్కొంది. ఈ క్రమంలో శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు కోహ్లీ కన్నా ముందే వ్యాక్సిన్ తీసుకున్నారు.
కరోనా పోరులో భాగంగా విరాట్ కోహ్లీ, తన సతీమణి అనుష్క శర్మతో కలిసి ఫండ్ రైజింగ్ క్యాంపైన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ముందుగా ఈ జోడీ తమ వంతుగా రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ప్రకటించి ఈ మంచి పనికి శ్రీకారం చుట్టింది. క్వెట్టా సంస్థతో కలిసి ఈ ఫండ్ రైజింగ్ క్యాంపైన్ నిర్వహిస్తుంది. ఇక ఫస్ట్ వేవ్ సమయంలో పీఎంకేర్స్కు రూ.3 కోట్ల విరాళాన్ని అందజేసింది.