
న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ముఖ్యంగా సొంతగడ్డపై భారత జట్టుకు తిరుగే లేకుండా పోయింది. గత 10 ఏళ్లుగా ఏ జట్టు కూడా సొంత గడ్డపై భారత్ను ఓడించలేకపోయింది. దాంతో స్వదేశంలో వరుసగా 15 సిరీస్లు గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది.
శ్రీలంకతో సోమవారం ముగిసిన డే/టెస్ట్లో టీమిండియా 238 పరుగుల భారీ తేడాతో గెలపొందింది. దాంతో రెండు టెస్ట్ల సిరీస్ను 2-0తో కైవసం చేసుకుంది. ఇది టీమిండియాకు సొంతగడ్డపై వరుసగా 15వ సిరీస్ విజయం. దాంతో తమ పేరిట ఉన్న రికార్డునే భారత్ మెరుగుపరుచుకుంది. టీమిండియా చివరిసారిగా సొంతగడ్డపై 2012లో ఇంగ్లండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఓడిపోయింది. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు ఈ పరాజయాన్ని చవిచూసింది. ఇక అప్పటి నుంచి భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా కోల్పోలేదు. స్వదేశంలో తిరుగులేని అజేయ జట్టుగా కొనసాగుతుంది.
టీమిండియా తర్వాత స్వదేశంలో అత్యధిక వరుస టెస్ట్ సిరీస్లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా ఉంది. కంగారూ జట్టు స్వదేశంలో వరుసగా 10 టెస్ట్ సిరీస్ల్లో విజయం సాధించింది. ఆసీస్ రెండుసార్లు (నవంబర్ 1994-నవంబర్ 2000 మధ్యలో ఓసారి, జులై 2004-నవంబర్ 2008 మధ్యలో మరోసారి) ఈ ఘనత సాధించడం విశేషం.
447 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక 208 పరుగులకే కుప్పకూలింది. లంక్ కెప్టెన్ దిముత్ కరుణ రత్నే(174 బంతుల్లో 15 ఫోర్లతో 107) సెంచరీతో చెలరేగినా ఫలితం లేకపోయింది. కుశాల్ మెండీస్(60 బంతుల్లో 8 ఫోర్లతో 54) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఇతర ఆటగాళ్లు విఫలమయ్యారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా.. జస్ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. అక్షర్ పటేల్కు రెండు, రవీంద్ర జడేజాకు ఓ వికెట్ దక్కింది. ఈ విజయంతో రెండు టెస్ట్ల సిరీస్ను భారత్ 2-0తో కైవసం చేసుకుంది. రెండున్నర రోజుల్లో గులాబీ టెస్ట్ ముగియడం విశేషం. ఇక సొంతగడ్డపై భారత్కు ఇది వరుసగా 15వ టెస్ట్ సిరీస్ విజయం కావడం గమనార్హం.
భారత్ తొలి ఇన్నింగ్స్ 252 ఆలౌట్ (శ్రేయస్ అయ్యర్ 92)
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 109 ఆలౌట్ ( మాథ్యూస్ 43, బుమ్రా 5/24)
భారత్ రెండో ఇన్నింగ్స్ 303/9 డిక్లెర్డ్ (రిషభ్ పంత్ 50, శ్రేయస్ అయ్యర్ 67)
శ్రీలంక రెండో ఇన్నింగ్స్ 208 ఆలౌట్( దిముత్ కరుణ రత్నే 107, కుశాల్ మెండీస్ 54)