డబ్ల్యూటీసీలో మూడో స్థానంలో..
మరోవైపు 2021-23 ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్షిప్ పట్టికలో టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ సిరీస్ల్లో మొత్తం 6 టెస్టులు ఆడిన కోహ్లీసేన 3 విజయాలు, ఒక ఓటమి, రెండు డ్రాలతో మొత్తం 42 పాయింట్లు సాధించింది. దీంతో విజయాల శాతంలో మూడో స్థానం సంపాదించింది. మరోవైపు శ్రీలంక రెండు విజయాలతో 100 శాతం మెరుగైన ఫలితాలు సాధించి 24 పాయింట్లతోనే అగ్రస్థానం సంపాదించింది. అలాగే పాకిస్థాన్ రెండు మ్యాచ్లు గెలిచి ఒకటి ఓటమిపాలవ్వడంతో 66.66 విజయ శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలోనే టీమిండియా 58.33 విజయ శాతంతో మూడో స్థానంలో నిలిచింది.
సమష్టిగా రాణించి..
ముంబై టెస్ట్లో సమష్టిగా రాణించిన కోహ్లీసేన 372 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. 540 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ భారత స్పిన్నర్ల ధాటికి రెండో ఇన్నింగ్స్లో 167 పరుగులకే కుప్పకూలింది. డారిల్ మిచెల్(92 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్లతో 60), హెన్రీ నికోల్స్(111 బంతుల్లో 8 ఫోర్లు 44), విల్ యంగ్ (41 బంతుల్లో 4 ఫోర్లతో 20), రచిన్ రవీంద్ర(50 బంతుల్లో 4 ఫోర్లతో 18) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితయ్యారు. భారత బౌలరల్లో రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు.
భారత్ తొలి ఇన్నింగ్స్లో 325 పరుగులు చేయగా.. కివీస్ కేవలం 62 పరుగులకే ఆలౌటైంది. ఇక రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 276/7 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. సెంచరీ, హాఫ్ సెంచరీతో రాణించిన మయాంక్ అగర్వాల్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా.. రవిచంద్రన్ అశ్విన్కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ వరించింది.
భారత్కు ఇదే భారీ విజయం..
టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత్కు ఇదే అత్యంత భారీ విజయం. ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 372 పరుగులతో గెలుపొందింది. ఇప్పటి వరకు ఇదే ఆల్టైమ్ రికార్డు. అంతకుముందు 2015లో ఢిల్లీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో 337 పరుగులతో భారత్ గెలుపొందింది. ఇక 2016లో ఇండోర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఇదే న్యూజిలాండ్ను భారత్ 321 పరుగులతో చిత్తు చేసింది. 2008లో మోహాలి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 320 రన్స్తో గెలిచింది. ఇప్పటి వరకు ఇవే భారీ విజయాలుగా ఉండగా.. తాజాగా ముంబై టెస్ట్ ఫలితం ఈ రికార్డులను అధిగమించింది.
న్యూజిలాండ్ చెత్త రికార్డు..
తాజా మ్యాచ్లో 372 పరుగుల భారీ తేడాతో చిత్తయిన కివీస్ చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా న్యూజిలాండ్కిదే అత్యంత భారీ ఓటమి.
2007లో జోహెనస్బర్గ్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో కివీస్ 358 రన్స్ తేడాతో ఓడింది. ఇప్పటి వరకు అత్యంత దారుణమైన పరాజయం ఉండగా.. ముంబై టెస్ట్ ఓటమి దాన్ని అధిగమించింది. అంతకుముందు 2016లో భారత్ చేతిలో 321 రన్స్ తేడాతో, 2001లో ఆక్లాండ్ వేదికగా పాకిస్థాన్తో 299 రన్స్ తేడాతో కివీస్ ఓటమిపాలైంది.