
న్యూఢిల్లీ: సౌతాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కోసం టీమిండియా సన్నాహకాలను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా సోమవారం తొలి ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. యంగ్ పేసర్లు ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్ నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చారు. అయితే యార్కర్లు వేయడంలో అర్షదీప్.. ఉమ్రాన్ను మించిపోయాడు. కానీ టీ20 ప్రపంచకప్ దృష్ట్యా ఉమ్రాన్ మాలిక్కు ఎక్కువ అవకాశాలివ్వనున్నారు. ఆస్ట్రేలియా వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుండగా.. అక్కడి పిచ్లు పేస్కు అనుకూలిస్తాయి. ఈ క్రమంలోనే 150 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేస్తున్న ఉమ్రాన్ను టీమిండియా తమ వెపన్లా తయారు చేసుకుంటుంది.
భువనేశ్వర్, హర్షల్ పటేల్తో పాటు ఉమ్రాన్ మాలిక్ను సౌతాఫ్రికాతో సిరీస్లో పరీక్షించనుంది. ప్రాక్టీస్ సెషన్ను చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, పారస్ మాంబ్రే పర్యవేక్షించారు. ఉమ్రాన్ బౌలింగ్లో పంత్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. షార్ట్ స్పెల్లో అర్షదీప్.. మిడిల్ స్టంప్ను లక్ష్యంగా చేసుకొని పర్ఫెక్ట్ యార్కర్లు వేసాడు. కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్ నెట్ సెషన్లో పాల్గొన్నారు. రిథమ్ కోసం ప్లేయర్లందరూ కాసేపు మాత్రమే ప్రాక్టీస్ చేశారు. దినేశ్ కార్తీక్ కూడా కొద్ది సేపు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసి ల్యాప్ స్కూప్, రివర్స్ ల్యాప్ స్యూప్ షాట్లు కొట్టాడు. కాగా, హార్దిక్ పాండ్యా నేడు (మంగళవారం) టీమ్లో చేరనున్నాడు.
ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ గురువారం ఢిల్లీ వేదికగా జరగనుంది. రెండేళ్ల తర్వాత ఈ సిరీస్ ఎలాంటి బయో బబుల్ లేకుండా జరగనుంది. ఇప్పటికే భారత్కు చేరిన సౌతాఫ్రికా సిరీస్ విజయమే లక్ష్యంగా ప్రిపేరవుతోంది.