సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలవడంతో యావత్ భారత్ సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఫైనల్ మ్యాచ్ ముగిసి 48 గంటలు కావొస్తున్న అభిమానులు మాత్రం ఈ విజయాన్ని సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉన్నారు. ప్రపంచకప్ గెలిచిన భారత ఆటగాళ్లకు ఘన స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు.
కానీ అభిమానుల ఆశలపై భారీ తుఫాను నీళ్లు చల్లింది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ జరిగిన బార్బడోస్తో పాటు సెయింట్ లూసియా, గ్రెనడా, సెయింట్ విన్సెంట్, గ్రైనడైన దీవులపై బెరిల్ సుడిగాలి(హరికేన్) పంజా విసురుతోంది. దాంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అక్కడి అధికారులు ఆదేశించారు.

బెరిల్ హరికేన్ కారణంగా ఆ ప్రాంతంలోని విమాన రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. బార్బడోస్ విమానాశ్రాయాన్ని తాత్కలికంగా మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల భారత ఆటగాళ్లు తాము బస చేస్తున్న హోటల్కే పరమితమయ్యారు.
ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో టీమిండియా ఆటగాళ్ల రాక ఆలస్యమయ్యే అవకాశం ఉంది. తుఫాను ప్రభావం తగ్గే వరకు ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. భారత ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులను బయటకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ తుఫాను కారణంగా భారత ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.
హోటల్లోని సిబ్బంది కొరత కారణంగా భారత ఆటగాళ్లు క్యూలైన్లో నిల్చొని పేపర్ ప్లేట్లలో భోజనం చేసినట్లు ప్రపంచకప్ కవరేజ్ కోసం వెళ్లిన అక్కడి మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ పేపర్ ప్లేట్లలోనే పూర్తి చేసినట్లు సమాచారం. భారత ఆటగాళ్లను స్వదేశం తీసుకొచ్చేందుకు బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.