విరాట్ కోహ్లీ బాటలోనే రోహిత్ శర్మ.. గాయాలవ్వకుండా ఉండేందుకు కఠిన నిర్ణయం!

న్యూఢిల్లీ: గత రెండు నెలలుగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఫిట్నెస్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఐపీఎల్ 2020 సీజన్ ఫస్ట్ మ్యాచ్లో పొట్టతో బరిలోకి దిగడంపై కూడా జోకులు పేలాయి. రోహితే కాదు లాక్డౌన్ కారణంగా ఇతర ఆటగాళ్లు కూడా కొంచెం బరువు పెరిగారు. అయితే ఈ అధిక బరువు కారణంగానే రోహిత్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు.
అప్పర్ బాడీ అధిక బరువు లోయర్ బాడీపై అతిగా పడటంతో కండరాలు పట్టేశాయి. ఈ గాయం కారణంగానే హిట్ మ్యాన్ తొలుత ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవ్వలేదు. ఆ తర్వాత ప్లే ఆఫ్స్ మ్యాచ్ ఆడి టెస్ట్ టీమ్లో చోటు దక్కించుకున్నాడు. కానీ జట్టుతో ఆసీస్ వెళ్లకుండా భారత్కు తిరిగొచ్చి అందరికి షాకిచ్చాడు.

రియలైజ్ అయిన రోహిత్..
ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ( ఎన్సీఏ)లో చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రత కారణంగా ఇప్పుడు తొలి రెండు టెస్ట్ మ్యాచ్లకు కూడా దూరమయ్యాడు. డిసెంబర్ 11న అతనికి ఫిట్నెస్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఈ పరీక్షా ఫలితంపై హిట్మ్యాన్ ఆసీస్ టూర్ భవితవ్యం ఆధారపడి ఉంది. ఇక ఈ వరుస ఘటనలతో తీవ్ర చికాకు గురైన రోహిత్.. ఈ పరిస్థితికి అధిక బరువే కారణమని గుర్తించాడు. దాంతో బరువు తగ్గాలనే కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తు మ్యాచ్ల దృష్ట్యా గాయం నుంచి కోలుకోవడానికి, మళ్లీ మళ్లీ గాయపడకుండా ఉండేందుకు బరువు తగ్గడమే పరిష్కారమని భావించాడు. వెంటనే బరువు తగ్గడానికి గల కార్యచరణను మొదలు పెట్టాడు.

కోహ్లీ బాటలోనే..
ఒకప్పుడు బొద్దుగా ఉండే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరుస వైఫల్యాలతో రియాలైజ్ అయ్యాడు. ఆటగాడికి ఫిట్నెస్ ఎంత ముఖ్యమో గుర్తించాడు. విదేశీ ఆటగాళ్లకు తనకు ఉన్న తేడాను గుర్తించాడు. వెంటనే తన అలవాట్లన్నీ మార్చుకొని బరువు తగ్గడంపై దృష్టిసారించాడు. నోరు కట్టుకొని జిమ్లో గంటలకొద్దీ తీవ్ర కసరత్తులు చేశాడు. బాలీవుడ్ హీరో తరహాలో బాడీని మార్చుకొని మైదానంలో ఫలితాలు రాబట్టాడు. ఫిట్నెస్ ఫ్రీక్గా మారి అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఇప్పుడు రోహిత్ కూడా విరాట్లానే రియలైజ్ అయ్యాడు. అతని బాటలోనే నడుస్తూ బరువు తగ్గేందుకు కసరత్తులు చేస్తున్నాడు.

బక్కగా ఉంటే గాయలవ్వవు..
బరువు తగ్గితే కండరాల గాయానికి గురవ్వరని, రోహిత్ కూడా దానిపై కసరత్తులు చేస్తున్నాడని ఓ బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపాడు. ‘టీమ్ ఫిజియో క్లీన్ చీట్ ఇవ్వకుంటే ఏ ఆటగాడైనా ఫిట్నెస్ టెస్ట్కు హాజరవ్వాల్సి ఉంటుంది. రోహిత్ గాయం తగ్గించుకోవడానికి చికిత్స తీసుకుంటున్నాడు. అతని అప్పర్ బాడీ బరువును తగ్గించుకునేందుకు శ్రమిస్తున్నాడు. బరువు తక్కువగా ఉంటే కండరాలపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అప్పుడు ఎలాంటి గాయాలవ్వవు'అని సదరు అధికారి పేర్కొన్నాడు.

ఈ ఏడాది మొత్తం గాయాలే..
ఇక హిట్ మ్యాన్కు 2020 ఏమాత్రం కలిసి రాలేదు. ఏడాది పొడువునా గాయాలతో సతమతమయ్యాడు. ప్రారంభంలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన రోహిత్ మధ్యలోనే తిరిగొచ్చాడు. ఆ తర్వాత లాక్డౌన్ రావడంతో ఫిట్ అవ్వడానికి అతనికి టైమ్ లేకుండా పోయింది. ఆ తర్వాత ఐపీఎల్లో కూడా ఇదే సమస్య పునరావృతం అవడంతో రోహిత్.. బరువు తగ్గడంపై సీరియస్గా ఫోకస్ పెట్టాడని అతని సన్నిహిత్ వర్గాలు పేర్కొన్నాయి. ‘రోహిత్ ఈ సారి ఎలాంటి అవకాశం తీసుకోవాలనుకోవడం లేదు. ఫిట్నెస్పై సీరియస్గా ఫోకస్ పెట్టాడు. గత ఏడాదిగా దృష్టిసారించినా లాక్ డౌన్ కారణంగా కుదరలేదు. వచ్చే ఏడాది నాన్ స్టాప్ క్రికెట్ ఆడాలనే కసితో రోహిత్ ఉన్నాడు. బరువును తగ్గించుకోవాలనుకుంటున్నాడు.'అని హిట్ మ్యాన్ సన్నిహితులు తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications