
మెల్బోర్న్: ఈ ఏడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాలో పర్యటించే భారత జట్టు ప్రేక్షకుల మధ్యే క్రికెట్ మ్యాచ్లు ఆడే అవకాశం కనిపిస్తోంది. కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన మరిన్ని ఆంక్షలను సడలిస్తున్నట్లు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ శుక్రవారం ప్రకటించారు. వచ్చే నెల నుంచి స్టేడియాల్లో ప్రేక్షకులకు అనుమతిస్తున్నట్లు కూడా తెలిపారు. అయితే సీటింగ్ సామర్థ్యంలో 25 శాతం మాత్రమే ప్రేక్షకులు హాజరుకావాలనే నిబంధన పెట్టారు.
ఆ లెక్క ప్రకారం 40వేల సీట్ల సామర్థ్యం ఉన్న స్టేడియాల్లో పది వేల మందిని మాత్రమే అనుమతించనున్నారు. మ్యాచ్లతో పాటు ఉత్సవాలు, కచేరీల వంటి ఈవెంట్లను కూడా 25 శాతం సీటింగ్ సామర్థ్యంతో నిర్వహించుకోవచ్చని స్పష్టం చేశారు. సీట్ల మధ్య తగిన దూరాన్ని పాటించాలన్నారు. వైద్యాధికారులతో సంప్రదించి ఈవెంట్లలో పాటించాల్సిన నిబంధనలను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.
కరోనాపై చేస్తున్న పోరాటంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సన్నిహితంగా పనిచేస్తున్నామని మోరిసన్ తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకుని అంతర్జాతీయ విద్యార్థులను తిరిగి తమ దేశానికి తీసుకొస్తామన్నారు. అయితే కరోనాను నియంత్రిస్తున్న సమయంలో వర్ణవివక్షను వ్యతిరేకిస్తూ ర్యాలీల్లో పాల్గొన్న ప్రజల్ని ఆయన తప్పుబట్టారు. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ణవివక్షను వ్యతిరేకిస్తూ ఆసీస్లో సిడ్నీ, మెల్బోర్న్, బ్రిస్బేన్లో ప్రజలు నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆసీస్లో ఇప్పటివరకు 7,209 మందికి కరోనా సోకగా 102 మంది మరణించారు. 405 కేసులు యాక్టివ్లో ఉన్నాయి.
ఇక భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 3 నుంచి గబ్బా వేదికగా తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఇక ప్రధాని తాజా వ్యాఖ్యలతో ప్రేక్షకుల మధ్యే ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. మరోవైపు టీ20 ప్రపంచకప్ వాయిదా నిర్ణయంపై కూడా ఐసీసీ పునారాలోచించనుంది. ప్రేక్షకులను అనుమతిస్తే టోర్నీ నిర్వహణకే ఐసీసీ మొగ్గు చూపనుంది. ఇదే జరిగితే ఐపీఎల్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకుంటాయి.