
సరిహద్దుల సమస్యలతో..
ఇక ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో క్రికెట్ సిరీస్లు కూడా జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దాంతో ఈ ఇరు దేశాల పోరుకు మరింత క్రేజ్ ఏర్పడింది. ఇక ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్లోనూ ఇరు దేశాలు తమ తొలి మ్యాచ్లోనే తలపడనున్నాయి. అయితే ఈ మెగాటోర్నీకి ముందే ఆసియా కప్ 2022 టోర్నీలో భాగంగా పాకిస్థాన్తో భారత్ తలపడనుంది. ఆగస్టు 28న భారత్, పాకిస్థాన్ మధ్య ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

ఆసియా కప్ టోర్నీలో..
షెడ్యూల్ ప్రకారం శ్రీలంక వేదికగా ఆగస్టు 27నుంచి సెప్టెంబర్ 11 వరకూ ఆసియా కప్ 2022 టోర్నీ జరగనుంది. ప్రస్తుతం శ్రీలంకలో ఉన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఆసియా కప్ను లంక బోర్డు నిర్వహించగలదా? అనే సందేహాలు నెలకొన్నాయి. కానీ ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్ సక్సెస్ కావడంతో ఆ అనుమానాలకు సమాధానం దొరికింది. ఆసియా కప్ 2022 టోర్నీలో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగిన రెండు నెలలకే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా అక్టోబర్ 23న ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్కి సంబంధించిన టిక్కెట్లు ఎప్పుడో అమ్ముడయ్యాయి.

పాక్కు వెళ్లకుంటే..
వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 టోర్నీలోనూ భారత్-పాక్ తలపడే అవకాశం ఉంది. దానికి ముందు పాకిస్థాన్లో ఆసియా కప్ 2023 టోర్నీ వన్డే ఫార్మాట్లో జరుగనుంది. కొన్ని దశాబ్దాలుగా పాకిస్థాన్లో అడుగుపెట్టని టీమిండియా, ఆసియా కప్లో పాల్గొంటుందా అనేది అనుమానంగా మారింది. భారత జట్టు, ఆసియా కప్ కోసం పాకిస్థాన్కు రాకపోతే, తాము భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొనమని ఇప్పటికే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు హెచ్చరించింది. ఈ రెండు టోర్నీలు సజావుగా జరిగితే వచ్చే ఏడాది మరో రెండుసార్లు భారత్, పాకిస్థాన్ మ్యాచ్లను అభిమానులు వీక్షించవచ్చు.


Click it and Unblock the Notifications
