
లండన్: ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి సందడి చేశాడు. అవును వరల్డ్ నెంబర్ వన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ను రవిశాస్త్రి దగ్గరుండి గెలిపించాడు. ఆదివారం సాయంత్రం జరిగిన వింబుల్డన్ పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్కు రవిశాస్త్రి హాజరయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో భారత ఆటగాళ్లకు బీసీసీఐ 20 రోజుల బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్కు ఇంకా మూడు వారాల సమయం ఉండటంతో సేదతీరేందుకు అవకాశం ఇచ్చింది. దాంతో బ్రిటన్ పర్యాటక ప్రాంతాలను చుట్టేస్తున్న టీమిండియా ఆటగాళ్లు.. టైమ్ దొరికితే యూరో 2020 ఫుట్ బాల్ మ్యాచ్లకు, వింబుల్డన్ మ్యాచ్లకు హాజరవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రవిశాస్త్రి వింబుల్డన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్ను ప్రత్యక్షంగా వీక్షించి ఆస్వాదించాడు. ఈ విషయాన్ని అతనే ట్విటర్ వేదికగా వెల్లడించాడు. వింబుల్డన్ స్టేడియంలో కూర్చున్న తన సెల్పీని షేర్ చేసిన రవిశాస్త్రి.. 'నమ్మలేని అనుభూతి' అని దానికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇంగ్లండ్తో ఆగస్టు 4 నుంచి ఐదు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే విబుల్డన్ 2021 టైటిల్ను ముందుగా ఊహించినట్లుగానే ప్రపంచ నెంబర్ వన్ నోవాక్ జొకోవిచ్ కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో ప్రపంచ నంబర్వన్, టాప్ సీడ్ జొకోవిచ్ 3 గంటల 24 నిమిషాల్లో 6-7 (4/7), 6-4, 6-4, 6-3తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ బెరెటిని (ఇటలీ)పై గెలుపొందాడు. తద్వారా తన కెరీర్లో 6వ వింబుల్డన్ టైటిల్తో పాటు ఓవరాల్గా 20వ గ్రాండ్స్లామ్ టైటిల్ను సాధించాడు.
ఈ క్రమంలో పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారులుగా ఫెడరర్ (స్విట్జర్లాండ్), రాఫెల్ నాదల్ (స్పెయిన్-20 చొప్పున) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్ సమం చేశాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్కు 17 లక్షల పౌండ్లు (రూ. 17 కోట్ల 61 లక్షలు), రన్నరప్ బెరెటినికి 9 లక్షల పౌండ్లు (రూ. 9 కోట్ల 32 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. ఈ సీజన్లో ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్లోనూ చాంపియన్గా నిలిచిన 34 ఏళ్ల జొకోవిచ్ సెప్టెంబర్లలో జరిగే యూఎస్ ఓపెన్లోనూ గెలిస్తే రాడ్ లేవర్ (1969లో) తర్వాత 'క్యాలెండర్ గ్రాండ్స్లామ్' ఘనత సాధించిన ప్లేయర్గా రికార్డు సృష్టిస్తాడు.