
ముంబై: ఇంగ్లండ్ పర్యటన కోసం భారత పురుషుల, మహిళల జట్లు బుధవారం అర్థరాత్రి ప్రత్యేక విమానంలో బయలుదేరాయి. గత రెండు వారాలుగా ముంబైలో ఓ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన బయో బబుల్లో ఉన్న రెండు జట్లూ కుటుంబ సభ్యులతో కలిసి ఫ్లైట్ ఎక్కాయి. ఆటగాళ్ల ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
పురుషుల కెప్టెన్ విరాట్ కోహ్లి, మహిళల కెప్టెన్ మిథాలీ రాజ్తోపాటు స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, జులన్ గోస్వామి మాస్క్లు ధరించి ఫ్లైట్ ఎక్కారు. అయితే సెలబ్రిటీ కపుల్ విరాట్ కోహ్లి, అనుష్క శర్మ తమ కూతురు వామికతో కలిసి ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్న ఫొటోలు వైరల్గా మారాయి.
పురుషుల టీమ్ న్యూజిలాండ్తో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్తోపాటు ఇంగ్లండ్ టీమ్తో ఐదు టెస్టులు ఆడనుంది. అటు మహిళల జట్టు ఆతిథ్య ఇంగ్లండ్తో ఏకైక టెస్టు తో పాటు మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. జూన్ 18 నుంచి 22 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది.
ఈ పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన కోహ్లీ.. ఇరు జట్లకు సమాన అవకాశాలున్నాయని తెలిపాడు. తనపై ఎలాంటి ఒత్తిడి లేదన్నాడు. ఏ టీమ్ ఒక్కో సెషన్, ఒక్కో గంట మెరుగైన ఆట ఆడుతుందో ఆ టీమ్దే చాంపియన్షిప్ అని తెలిపాడు. అటు మహిళల టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ కూడా ఫ్లైట్ ఎక్కే ముందు మీడియాతో మాట్లాడింది.
తమలో చాలా మంది చాలా రోజుల తర్వాత ఓ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నట్లు చెప్పింది. మెన్స్ టీమ్ కూడా తమతోపాటే ఉండట వల్ల.. యూకేలో ఎలా ఆడాలో వాళ్లను అడిగి తెలుసుకున్నామని తెలిపింది. వాళ్లతో సమయం దొరికినప్పుడల్లా తమ టీమ్ ప్లేయర్స్ మాట్లాడుతూనే ఉన్నారని చెప్పుకొచ్చింది. ఇక విజయంతో తిరిగిరావాలని విరాట్ సేన్, మిథాలీ సేనలకు అభిమానులు గుడ్ లక్ చెబుతున్నారు.