టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అధికార భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరారు. గత కొంతకాలంగా బీజేపీ పార్టీకి సన్నిహితంగా ఉంటున్న జడేజా.. తన సతీమణి రివాబా జడేజాను బీజేపీ ఎమ్మెల్యేగా కూడా గెలిపించారు. జడేజా బీజేపీలో చేరిన విషయాన్ని అతని సతమణి రివాబా జడేజా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తనతోపాటు తన భర్త రవీంద్ర జడేజా బీజేపీలో సభ్యత్వ నమోదు కార్డు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సభ్యత్వ కార్డులను కూడా షేర్ చేశారు.

2019లో రివాబా జడేజా బీజేపీలో చేరారు. గుజరాత్ అసెంబ్లీ 2022 ఎన్నికల్లో జామ్ నగర్ ఉత్తర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమె బీజేపీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించారు. ఆమె గెలుపు కోసం రవీంద్ర జడేజా తీవ్రంగా శ్రమించారు. గాయాన్ని సాకుగా చూపించి టీమిండియాకు దూరంగా ఉన్న జడేజా.. రివాబా ఎన్నికల ప్రచారంలో జోరుగా పాల్గొన్నారు.
ఇటీవల టీమిండియా టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన అనంతరం జడేజా అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికారు. సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ విజయం సాధించి 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐసీసీ టైటిల్ను అందుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ మ్యాచ్ గెలిచిన వెంటనే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్కు వీడ్కోలు పలుకగా.. జడేజా వారిని అనుసరిస్తూ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు.
కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా.. కేవలం టెస్ట్ ఫార్మాట్కు పరిమితమయ్యే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న జడేజా.. సెప్టెంబర్ 19 బంగ్లాదేశ్తో జరిగే టెస్ట్ సిరీస్కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లగా.. జడేజాకు చోటు దక్కలేదు. దులీప్ ట్రోఫీ 2024కి కూడా జడేజాను పరిగణలోకి తీసుకోలేదు.
మరోవైపు అక్షర్ పటేల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దాంతో జడేజాకు టీమిండియాలో దారులు మూసుకుపోతున్నాయి. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోపు జడేజా కెరీర్కు ముగింపు పడే అవకాశం ఉంది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో జడేజా బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది. ఈ ప్రణాళికలతోనే జడేజా బీజేపీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.