
పోష్స్ట్రూమ్ (దక్షిణాఫ్రికా): మహిళల తొలి అండర్-19 ప్రపంచకప్ విజేతగా భారత్ నిలిచింది. సౌతాఫ్రికా వేదికగా 16 జట్లు పాల్గొన్న ఈ టీ20 టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శనతో టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో షెఫాలీ వర్మ నేతృత్వంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ అండర్ -19 టీమ్పై నెగ్గింది. ఏ స్థాయిలోనైనా భారత మహిళల క్రికెట్ జట్టుకు ఇదే తొలి ప్రపంచకప్ కావడంతో షెఫాలీ సేనపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మహిళల ప్రపంచకప్ విజయాన్ని భారత పురుషుల జట్టు కూడా సెలెబ్రేట్ చేసుకుంది. న్యూజిలాండ్తో రెండో టీ20 విజయానంతరం భారత అమ్మాయిలకు అభినందనలు తెలిపింది.
ఈ వీడియోను బీసీసీఐ అభిమానులతో పంచుకోగా వైరల్ అయ్యింది. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్.. పురుషుల అండర్ 19 ప్రపంచకప్ విన్నింగ్ కెప్టెన్ అయిన పృథ్వీ షాతో అమ్మాయిలకు విషెస్ చెప్పించాడు. 'భారత మహిళల క్రికెట్కు ఇది చరిత్రలో నిలిచిపోయే రోజు. నా కంటే అండర్ 19 పరుషుల ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ పృథ్వీ షా ఈ విజయంపై మాట్లాడితే బాగుంటుంది'అని రాహుల్ అనగా..మైక్ అందుకున్న పృథ్వీ షా ఇదో గొప్ప ఘనతని తెలిపాడు. 'అండర్ 19 ప్రపంచకప్ గెలిచిన అమ్మాయిలను పురుషుల జట్టులో ప్రతీ ఒక్కరు అభినందనలు తెలుపుతున్నారు. కంగ్రాట్స్ వెల్డన్'అని పృథ్వీ షా తెలిపాడు.
భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కూడా అమ్మాయిలను ప్రత్యేకంగా అభినందించింది. రూ.5 కోట్ల నజరానా కూడా ప్రకటించింది. ఫైనల్లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ 17.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 14 ఓవర్లలో 3 వికెట్లకు 69 పరుగులు చేసి విజయాన్నందుకుంది. ప్రస్తుతం పురుషుల అండర్-19 వరల్డ్కప్ విజేత భారత్ కాగా... ఇప్పుడు మహిళల జట్టు కూడా జత చేరడం విశేషం. ప్రపంచకప్ నెగ్గిన భారత జట్టులో తెలంగాణ నుంచి గొంగడి త్రిష, యశశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ అమ్మాయి షబ్నమ్ సభ్యులుగా ఉన్నారు.