
శ్రీలంకలో శిఖర్ ధావన్..
కరోనా కారణంగా ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా ఆగిపోవడంతో టీమిండియా.. జూన్లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత ప్రధాన జట్టు, ఇంగ్లండ్ టూర్కి వెళితే... శ్రీలంకలో శిఖర్ ధావన్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పర్యటించింది. లంక పర్యటనలో కెప్టెన్గా వన్డే సిరీస్ను 2-1 తేడాతో అందించిన శిఖర్ ధావన్.. కరోనా దెబ్బతీ టీ20 సిరీస్ను 2-1తో కోల్పోయాడు. 2021 టీ20 వరల్డ్ కప్ టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ తప్పుకోవడం, వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం పెను వివాదానికి దారి తీసింది.

విరాట్ తప్పుకోవడంతో..
వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహానికి గురైన విరాట్.. టెస్ట్ కెప్టెన్సీ కూడా వదులుకున్నాడు. సౌతాఫ్రికా టూర్లో రెండో టెస్ట్కు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్, వన్డే సిరీస్కు కూడా సారథిగా వ్యవహరించాడు. ఈ పర్యటనలో భారత జట్టు, టెస్టు సిరీస్ని 2-1 తేడాతో కోల్పోగా... రాహుల్ కెప్టెన్సీలో వన్డే సిరీస్లో వైట్ వాష్ అయ్యింది... సౌతాఫ్రికా టూర్ నుంచి వచ్చిన తర్వాత స్వదేశంలో వెస్టిండీస్, శ్రీలంక జట్లతో వన్డే, టీ20 సిరీస్లు భారత్ ఆడగా.. రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరించాడు. రెండు జట్లను క్లీన్ స్వీప్ చేసి వరుసగా 15 మ్యాచుల్లో విజయాలు అందుకున్నాడు..

పంత్ నుంచి హార్దిక్కు..
ఐపీఎల్ 2022 టోర్నీ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్కి కెప్టెన్గా ఎంపికైన కెఎల్ రాహుల్, మొదటి టీ20 ఆరంభానికి ముందు గాయంతో తప్పుకున్నాడు. దీంతో రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. సౌతాఫ్రికాతో సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్లో పర్యటించే జట్టులో రిషభ్ పంత్కు చోటు దక్కడంతో... ఐర్లాండ్లో పర్యటించే మరో జట్టుకి హార్ధిక్ పాండ్యా సారథిగా ఎంపిక చేశారు. దాంతో ఏడాది కాలంలోనే టీమిండియాను ఏడుగురు కెప్టెన్లు నడిపించారు.


Click it and Unblock the Notifications
