
క్లిష్టపరిస్థితుల్లో..
పైగా గత రెండేళ్లుగా వరుస గాయాలతో బాధపడుతూ హార్దిక్ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉండటంతో పాటు భారత జట్టులోకి కూడా వస్తూ, పోతూ ఉన్నాడు. గతేడాది టీ20 ప్రపంచకప్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తర్వాత మళ్లీ క్రికెట్ మైదానంలో కనిపించలేదు. ఇలాంటి స్థితి నుంచి మొదలు పెట్టి సమర్థ నాయకత్వంతో టైటాన్స్కు వరుస విజయాలు అందించడమే కాకుండా ఏకంగా టైటిలే అందించాడు. ఎంతో మంది స్టార్లకు కూడా సాధ్యం కాని రీతిలో ఐపీఎల్ ట్రోఫీని గెలిపించి అతను తన స్థాయిని గొప్పగా ప్రదర్శించాడు. మొత్తం లీగ్లో బ్యాటింగ్లో 131.26 స్ట్రయిక్రేట్తో 487 పరుగులు చేయడంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు (మొత్తం 8) పడగొట్టి ఆల్రౌండర్గా హార్దిక్ తన సత్తా ఏంటో తెలియజేశాడు.

ప్రశాంతంగా ఉంటూ..
అయితే హార్దిక్ కెప్టెన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎదుటివారు ఏమనుకున్నా తాను చెప్పాలనుకున్నది బల్లగుద్దినట్టు చెప్పే తత్వం హార్దిక్ది. అది అతడికి చిన్ననాటి నుంచే వచ్చింది. ముక్కుసూటిగా మాట్లాడి.. యాటిట్యూడ్ ప్రదర్శించి పలుసార్లు విమర్శలకూ గురయ్యాడు. ఈ సీజన్ ఆరంభంలోనూ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసి సీనియర్ ఆటగాళ్ల చేత చివాట్లు తిన్నాడు. కానీ ఆ తర్వాత సపోర్ట్ స్టాఫ్, సీనియర్ ఆటగాళ్ల సూచనలతో తన వ్యక్తిత్వం మార్చుకొని ప్రశాంతంగా ఉండటం నేర్చుకున్నాడు. అదే ఈ మెగా టోర్నీలో అతడికి బాగా కలిసొచ్చింది. ఆటగాళ్లు ఏదైనా తప్పు చేస్తే దగ్గరికెళ్లి మాట్లాడటం, నిరంతరం బౌలర్లకు అందుబాటులో ఉంటూ విలువైన సూచనలు చేయడం గుజరాత్ విజయానికి కలిసొచ్చింది.

సరైన నిర్ణయాలతో..
క్రికెట్లో గొప్ప సారథులుగా పేరుతెచ్చుకున్నవాళ్లంతా సమయస్ఫూర్తితో మెలిగిన వారే. కపిల్దేవ్ నుంచి ధోనీ దాకా మైదానంలో చురుగ్గా ఉంటూ అప్పటికప్పుడు సరైన నిర్ణయాలు తీసుకున్నవారే. అందుకే వారు విశ్వవిజేతలుగా ఎదిగారు. పాండ్య సైతం ఈ టోర్నీలో చేసింది అదే. వ్యూహరచనల్లో గానీ ఆటగాళ్లను సమర్థంగా వాడుకునే ప్రణాళికల్లో గానీ అతను వేసిన ప్రతీ అడుగు సత్ఫలితాలనిచ్చింది. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో పాండ్యా కెప్టెన్సీ పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎక్కడైనా సారథి ముందుండి నడిపిస్తే ఆ జట్టుకు లభించే ఆత్మవిశ్వాసమే వేరు. ఈ సీజన్లో పాండ్య చేసింది కూడా అదే. అటు బ్యాట్స్మన్గా, ఇటు బౌలర్గా గుజరాత్కు అవసరమైన సేవలు అందించాడు.

రోహిత్ కెప్టెన్సీకి ఎసరు..
హార్దిక్ కెప్టెన్సీ ప్రభావం ఎంతలా ఉందంటే.. ఇన్నాళ్లు అతన్ని భారత జట్టులో ఉంచేందుకు కూడా ఇష్టపడని వారంత కెప్టెన్ చేయాలని డిమాండ్ చేసేంత. రోహిత్ శర్మ వారసుడిగా కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పేర్లు వినిపించగా.. ఇప్పుడు వారి కంటే ఎక్కువగా హార్దిక్ పేరు వినిపిస్తోంది. కపిల్ దేవ్లా జట్టుకు టైటిల్ అందించే సత్తా హార్దిక్కు ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుత కెప్టెన్ రోహిత్ శర్మ వయసు నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ తర్వాత హార్దిక్ భారత పగ్గాలను అందుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది. విరాట్ కోహ్లీ మాదిరి రోహిత్ సైతం తన సారథ్య బాధ్యతలను వదులుకోవాల్సి వస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications
