న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గురువారం తన అభిమానులకు ఇన్స్టాగ్రామ్ వేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. తన వెయ్యో ఇన్స్టా పోస్ట్ అని పేర్కొన్న కోహ్లీ.. ఫ్యాన్స్కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభించిన 2008 నాటి ఫొటోకు ప్రస్తుత ఫొటో జత చేసి ఎడిట్ చేసిన యంగర్ విత్ సీనియర్ కోహ్లీ ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.
దీనికి 'ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఈ ప్రయాణంలో ముందుకు సాగుతున్నా. నా మీద మీరు చూపిస్తున్న ప్రేమ, మద్దతుకు రుణపడి ఉంటా' అంటూ 2008-2020 మధ్యలో రెండు చేతులు ఢీకొనే ఎమోజీని జతచేశాడు. ఆ ఫొటో చూస్తే నిజంగా ఇద్దరు కోహ్లీలు ఉన్నట్లు కనపడుతోంది. దీనికి స్పందించిన అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన అనుష్క శర్మ లవ్ సింబల్స్ను కామెంట్గా పెట్టింది. ఇక వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ మరో పదేళ్లు ఆడుతూనే ఉండాలని కామెంట్ చేశాడు.
ఇక అండర్-19 ప్రపంచకప్ గెలిచి భారత క్రికెట్లోకి తారాజువ్వలాగా దూసుకొచ్చిన కోహ్లీ.. అనతి కాలంలోనే స్టార్ క్రికెటర్గా ఎదిగాడు. ఫిట్ ఫ్రీక్గా మారి క్రికెట్ నయాట్రెండ్ తీసుకొచ్చిన విరాట్.. తనదైన బ్యాటింగ్తో పరుగుల మోత మోగిస్తున్నాడు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డులను సైతం ఒక్కొక్కటిగా బద్దలు కొడుతూ దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తున్నాడు.
సంప్రదాయక ఫార్మాట్ను తెగ ఇష్టపడే కోహ్లీ.. ఇప్పటి వరకు భారత్ తరఫున 86 టెస్ట్లు ఆడాడు. 53.62 సగటుతో 7240 రన్స్ చేశాడు. 248 వన్డేల్లో 59.33 యావరేజ్తో 11867 రన్స్ చేశాడు. ఇక 82 టీ20ల్లో 2794 పరుగులు చేశాడు.
హ్యాపీ బర్త్డే చహల్ భాయ్.. ఈ ఏడాదైనా జర లావుగా!