
న్యూఢిల్లీ: నిలకడలేమి ఫామ్తో ఇబ్బంది పడుతున్న సీనియర్ బ్యాట్స్మన్ చతేశ్వర్ పుజారా, అజింక్యా రహానేలకు భారత జట్టు అండగా ఉందని టీమిండియా నయా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే అన్నాడు. టెస్ట్ క్రికెట్లో వాళ్లకు తగినంత అనుభవం ఉందని, మునపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నారని చెప్పుకొచ్చాడు. గత రెండేళ్లుగా అజింక్యా రహానే వరుసగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. మెల్ బోర్న్ సెంచరీ తర్వాత రహానే ఒక్క చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పుజారా సైతం సెంచరీ చేసి మూడేళ్లు అవుతుంది. టెస్ట్ స్పెషలిస్ట్గా గుర్తింపు పొందిన పుజారా వైఫల్యం టీమ్ను కలవరపెడుతుంది.
ఈ నేపథ్యంలోనే ముంబై వేదికగా జరిగే రెండో టెస్ట్లో ఈ ఇద్దరికి చోటు దక్కడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే శుక్రవారం నుంచి ముంబై వేదికగా జరిగే రెండో టెస్ట్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన పరాస్ మాంబ్రే.. పుజారా, రహానేలు బరిలోకి దిగుతారని సంకేతమిచ్చాడు. 'టెస్ట్ క్రికెట్లో అజింక్య రహానే, చేతేశ్వర్ పుజారాలకు తగినంత అనుభవం ఉంది.
వీరిద్దరూ కలిసి చాలా సార్లు కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మునుపటి లయను అందుకోవడానికి ఒక్క ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నారు. అందుకే, ఓ జట్టుగా మేమంతా వాళ్లకు అండగా నిలబడ్డాం. వారి నుంచి టీమిండియా ఏమి ఆశిస్తుందో వారికి బాగా తెలుసు. వారిద్దరూ పుంజుకుంటే మిడిలార్డర్ మరింత బలోపేతమవుతుంది' అని పరాస్ మాంబ్రే అభిప్రాయపడ్డాడు.
రెండో టెస్టుకు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులోకి రానుండటంతో.. తుదిజట్టులో రహానేకు చోటు లభిస్తుందా? అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఇక రెండో టీ20లో చేతి వేలి గాయానికి గురైన మహమ్మద్ సిరాజ్ జట్టులోకి రావచ్చు. అదే జరిగితే ఇషాంత్ శర్మపై వేటు పడుతుంది. ఫస్ట్ టెస్ట్లో ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్ పెద్దగా రాణించలేదు.
ఉమేశ్ రెండు వికెట్లు తీసినా.. ఇషాంత్ శర్మ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మెడ నొప్పితో బాధపడుతున్న సాహా ఆడటంపై కూడా అనుమానాలు నెలకొన్నాయి. ఇక ఫస్ట్ టెస్ట్లో టీమిండియా వికెట్ దూరంలో విజయాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్లో ఇదే చివరి టెస్ట్ కావడంతో ఇరు జట్లు విజయంపై కన్నేసాయి. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.