భారత్ వర్సెస్ ఇంగ్లండ్ రెండో టెస్ట్ నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ(ఏపీఎస్ఆర్టీసీ) బస్సులో ప్రయాణించారు. తాము బస చేసిన హోటళ్ల నుంచి ఆర్టీసీ బస్సుల్లోనే డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ- వీడీసీఏ మైదానానికి చేరుకున్నారు. తొలి రోజు ఆట అనంతరం ఆర్టీసీకి చెందిన బస్సుల్లోనే హోటల్కు వెళ్లారు.
భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్లు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారనే విషయాన్ని ఏపీఎస్ఆర్టీసీ తమ అధికారిక ఎక్స్ పేజీలో అభిమానులతో పంచుకుంది.తమ బస్సుల్లో ప్రయాణించినందుకు భారత క్రికెట్ బోర్డు బీసీసీఐతో పాటు ఇంగ్లండ్ బోర్డు ఈసీబీకి ఏపీఎస్ఆర్టీసీ ధన్యవాదాలు తెలిపింది. ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన డాల్ఫిన్ క్రూజర్ బస్సుల్లో ఇరు దేశాల ఆటగాళ్లు ప్రయాణం చేశారు.

ప్రస్తుతం భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్ల ఆర్టీసీ బస్సు ప్రయాణానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఏపీఎస్ఆర్టీసీని నెటిజన్లు కొనియాడుతున్నారు. ఇలానే సంస్థను మరింత అభివృద్ధి వైపు నడపాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం ఆటగాళ్లకు కూడా టికెట్లు తీసుకున్నారా? అని సెటైర్లు పేల్చుతున్నారు.
ఈ మ్యాచ్లో టీమియండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్(257 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్లతో 179 బ్యాటింగ్) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 93 ఓవర్లలో 6 వికెట్లకు 336 పరుగులు చేసింది.
యశస్వి మినహా మరే బ్యాటర్ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. అతని తర్వాత శుభ్మన్ గిల్(34), రజత్ పటీదార్(32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్తో పాటు రవిచంద్రన్ అశ్విన్(5 బ్యాటింగ్) ఉన్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా.. టామ్ హార్ట్లీ, జేమ్స్ అండర్సన్ చెరో వికెట్ పడగొట్టారు.
కెప్టెన్ రోహిత్ శర్మ(14), శ్రేయస్ అయ్యర్(27)తో పాటు అక్షర్ పటేల్(27), లోకల్ భాయ్ కేఎస్ భరత్(17) దారుణంగా విఫలమయ్యారు. అరంగేట్ర ప్లేయర్ రజత్ పటీదార్(32) పర్వాలేదనిపించాడు.