సమష్టి వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయామని టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఏ ఒక్కరి ప్రదర్శన వల్లో ఈ పరాజయం ఎదురవ్వలేదని, జట్టుగా విఫలమయ్యామని తెలిపాడు.
సిడ్నీ వేదికగా ఆదివారం ముగిసిన ఐదో టెస్ట్లో ఆసీస్ 6 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో 10 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్(డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్ బెర్త్ను కూడా ఖాయం చేసుకుంది.

162 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 27 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఉస్మాన్ ఖవాజా(45 బంతుల్లో 4 ఫోర్లతో 41)రాణించగా.. ట్రావిస్ హెడ్(38 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), బ్యూ వెబ్స్టర్(34 బంతుల్లో 6 ఫోర్లతో 39) విజయ లాంఛనాన్ని పూర్తి చేశారు. భారత బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ(3/65) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(1/69) ఒక్క వికెట్ పడగొట్టాడు. గాయంతో బుమ్రా బౌలింగ్ చేయకపోవడం ఆసీస్కు కలిసొచ్చింది.
ఈ పరాజయం అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న గౌతమ్ గంభీర్ను బుమ్రా గైర్హాజరే ఆఖరి టెస్ట్లో టీమిండియా ఓటమికి కారణమా? అని ప్రశ్నించగా తనదైన శైలిలో బదులిచ్చాడు.
'జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వల్లే మేం ఓడిపోయామని నేను చెప్పను. మాకు గెలిచే అవకాశాలు లభించాయి. అయినా మేం విజయాన్నందుకోలేకపోయాం. సమష్టి వైఫల్యంతోనే సిరీస్ను కోల్పోయాం. జట్టు ఎప్పుడూ ఒక్క ఆటగాడిపై ఆధారపడకూడదు.'అని గంభీర్ బదులిచ్చాడు.
141/6 ఓవర్నైట్ స్కోర్తో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ 157 పరుగులకే కుప్పకూలింది. రిషభ్ పంత్(33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 61) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్కాట్ బోలాండ్(6/45) ఆరు వికెట్లతో భారత్ పతనాన్ని శాసించగా.. ప్యాట్ కమిన్స్(3/44) మూడు వికెట్లు పడగొట్టాడు. బ్యూ వెబ్స్టర్ ఒక వికెట్ తీసాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకు ఆలౌటైంది. అనంతరం ఆసీస్ తొలి ఇన్నింగ్స్లో 181 పరుగులే చేసింది. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల ఆధిక్యం దక్కినా భారత్ మెరుగ్గా బ్యాటింగ్ చేయలేకపోయింది. బ్యాటింగ్ వైఫల్యం ఈ సిరీస్లో టీమిండియా కొంపముంచింది.