చిన్నప్పుడు స్కూల్లో పెద్దయ్యాక ఏం చేస్తావ్? మీ లక్ష్యం ఏంటి? అని టీచర్లు అడిగేవారు. ఒక్కొక్కరు లేచి కలెక్టర్, పోలీస్, డాక్టర్, క్రికెటర్, టీచర్ అంటూ సమాధానాలు చెప్పేవారు. అలా చెప్పినవారిలో 99 శాతం మంది ఆ లక్ష్యాలను మరిచి ఏదో రంగంలో సెటిలైనవారే. కానీ మిగిలిన ఒక్కశాతం మంది మాత్రం పట్టు వదలకుండా శ్రమించి తమ చిన్నప్పటి లక్ష్యాలను అందుకున్నారు. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం.. ఈ ఒక్క శాతానికి చెందినవాడే. అవును ఈ విషయాన్ని అతని చిన్ననాటి టీచర్ విభా సచ్దేవ్ వెల్లడించారు.
'మేడమ్ నేను మరో సచిన్ అవుతా'అని విరాట్ కోహ్లీ తరుచూ చెప్పేవాడని, చిన్న వయసులోనే సచిన్ టెండూల్కర్ స్థాయి ఆటగాడిని కావాలని కోహ్లీ కలలు కనేవాడని గుర్తు చేసుకున్నారు. అతని మాటలు, ఆత్మవిశ్వాసం తమకు ఆశ్చర్యంగా అనిపించేదని, కొన్నిసార్లు నవ్వును తెప్పించేదని ఆమె గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం కోహ్లీని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, అతని చిన్ననాటి మాటలు గుర్తుకొస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు.

విరాట్ కోహ్లీ వెస్ట్ ఢిల్లీ, పశ్చిమ్ విహార్లోని విశాల్ భారతి పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇదే స్కూల్లో విరాట్ కోహ్లీకి ఓనమాలు నేర్పిన విభా సచ్దేవ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతని గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
'చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లీకి తన లక్ష్యంపై స్పష్టత ఉంది. 'మేడమ్ నేను మరో సచిన్ అవుతా'అని తరుచూ చెప్పేవాడు. కోహ్లీ కళ్లలో కనిపించే పట్టుదల, ఆత్మవిశ్వాసం చూసి మేం ఆశ్చర్యపోయేవాళ్లం. అతని మాటలకు ముచ్చటపడేవాళ్లం. కానీ అతను పట్టు వదలకుండా అనుకున్నది సాధించాడు. చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లీ చాలా చురుకుగా ఉండేవాడు. అతని కళ్ళు చాలా భావాలు వ్యక్తీకరించేవి. స్కూల్కు సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కోహ్లీ పాల్గొనేవాడు.
కోహ్లీ చదువుల్లో కూడా బాగా రాణించేవాడు. క్రికెట్ ప్రాక్టీస్ వల్ల కొన్నిసార్లు అతనికి మార్కులు తక్కువగా వచ్చేవి. కోహ్లీ తన క్రికెట్, చదువును అద్భుతంగా సమన్వయం చేసేవాడు. ఇందుకోసం చాలా కష్టపడేవాడు. ప్రాక్టీస్ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చి చదవుకుంటానని, పరీక్షల కోసం సిద్దమవుతానని కోహ్లీ తరుచూ చెప్పేవాడు. అతని ఇబ్బందిని అర్థం చేసుకొని మా టీచర్లంతా అతనికి కావాల్సిన గైడెన్స్ ఇస్తూ సాయం చేసేవారు.'అని విభా సచ్దేవ్ చెప్పుకొచ్చారు.
చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లీ స్పష్టమైన లక్ష్యం పెట్టుకున్నాడని విభా సచ్దేవ్ మాటలతో అర్థమవుతోంది. టీమిండియాలోకి వచ్చిన తర్వాత కోహ్లీ ఎంత కష్టపడ్డాడో.. తనను ఎలా మార్చుకున్నాడో అందరికి తెలిసిందే. కోహ్లీ జర్నీ గురించి మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఒక్కో లక్ష్యం దాటుకుంటూ కోహ్లీ వరల్డ్ నెంబర్ వన్ ప్లేయర్ అయ్యాడని, దాని కోసం కావాల్సిన హార్డ్ వర్క్ చేశాడని చెప్పారు.