టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్తో పాటు దేశవాళీ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. 12 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించడం సంతోషంగా ఉందని సోషల్ మీడియా వేదికగా శనివారం ఓ వీడియోను పంచుకున్నాడు. క్రికెటర్గా ఎదిగేందుకు అవకాశం ఇచ్చిన డీడీసీఏతో పాటు బీసీసీఐ, అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు.
రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్కు సహచర క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు, అభిమానులు విషేస్ తెలియజేస్తున్నారు. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షిస్తూ పోస్ట్లు పెడుతున్నారు. ఢిల్లీకి చెందిన శిఖర్ ధావన్.. 2004 అండర్ 19 ప్రపంచకప్ విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ టోర్నీ లో ధావన్ 7 మ్యాచ్ల్లో 505 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. మరే బ్యాటర్ కూడా 400 పరుగులు చేయలేదు.

టీమిండియాలోకి ఆలస్యం..
2004-05లో ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ధావన్.. టీమిండియాలోకి మాత్రం ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాడు. భారత్-ఏ జట్టు తరఫున అవకాశాలు దక్కిన ప్రధాన జట్టులో మాత్రం చోటు దక్కలేదు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మురళీ విజయ్, సచిన్ టెండూల్కర్, గౌతమ్ గంభీర్ ఓపెనర్లుగా సత్తా చాటుతుండటంతో శిఖర్ ధావన్ ఎంట్రీ ఆలస్యమైంది.
అయితే 2008 అండర్ 19 ప్రపంచకప్తో భారత క్రికెట్లోకి దూసుకొచ్చిన విరాట్ కోహ్లీ.. ధావన్ కంటే ముందే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే తనకంటే ముందే తన జూనియర్ అయిన కోహ్లీకి టీమిండియాలో చోటు దక్కడంతో ధావన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడని, క్రికెట్నే వదిలేయాలనుకున్నాడని అతని చిన్ననాటి కోచ్ తారక్ సిన్హా మీడియాకు తెలిపాడు.
క్రికెట్ను వదిలేయాలనుకున్నాడు..
'భారత జట్టులో చోటు దక్కకపోవడంతో ధావన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన జూనియర్, ఢిల్లీ టీమ్మేట్ విరాట్ కోహ్లీకి టీమిండియాలో చోటు దక్కి తనకు అవకాశం రాకపోవడంతో అతను తీవ్ర అసంతృప్తికిలోనయ్యాడు. ధావన్ నన్న తరుచూ.. 'నేను బాగానే ఆడుతున్నా కాదా..? ఎందుకు జట్టులోకి తీసుకోవడం లేదు?'అని ప్రశ్నిస్తున్నాడు. ఈ నిరీక్షణ తన వల్ల కాదని, క్రికెట్ వదిలేస్తానని ఆవేదన వ్యక్తం చేశాడు.

అతన్ని క్రికెట్లో కొనసాగేలా కన్విన్స్ చేయడం చాలా కష్టమైంది. నీ ప్రయత్నం ఏం వృథా కాదనే నమ్మకం కలిగించాను. అతను మరింత కష్టపడి టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు.'అని తారక్ సిన్హా 2013లో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
అరంగేట్ర మ్యాచ్లో డక్..
2010లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో డకౌట్ అయిన అతను.. మళ్లీ 2011లో రీఎంట్రీ ఇచ్చాడు. 2013లో రెగ్యులర్ ఓపెనర్గా అవకాశాన్ని ఖాయం చేసుకున్నాడు. 2010-2022 వరకు భారత్ తరఫున శిఖర్ ధావన్ 167 వన్డేలు, 34 టెస్ట్లు, 68 టీ20లు ఆడాడు. వన్డేల్లో 6793, టెస్ట్ల్లో 2315 పరుగులు చేశాడు.
టీ20ల్లో 1759 రన్స్ చేసిన గబ్బర్.. వన్డేల్లో 17, టెస్ట్ల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు 2015 వన్డే ప్రపంచకప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2018లో శిఖర్ ధావన్ టాప్ స్కోరర్గా నిలిచాడు. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో శిఖర్ ధావన్కు మెరుగైన రికార్డు ఉంది. 2019 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియాతో విరిగిన బొటన వేలితో శతకం సాధించాడు. రోహిత్ శర్మతో కలిసి వన్డేల్లో అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డును కూడా అందుకున్నాడు. ఈ ఇద్దరూ 115 ఇన్నింగ్స్ల్లో 5148 పరుగులు చేశారు.