
న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై భారత మహిళా క్రికెటర్, వికెట్ కీపర్ తానియా భాటియాకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె గదిలోకి ప్రవేశించిన ఓ అగంతకుడు బ్యాగును ఎత్తుకెళ్లాడు. అందులో డబ్బులతో పాటు కార్డులు, విలువైన వాచీలు, వస్తువులున్నాయి. మూడు వన్డేల సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అద్భుత ప్రదర్శనతో క్లీన్ స్వీప్ చేసింది. లెజండరీ ప్లేయర్ జులాన్ గోస్వామికి ఘన వీడ్కోలు పలికింది. అయితే ఈ పర్యటనకు వచ్చిన వికెట్ కీపర్ తానియా భాటియా లేని సమయంలో ఆమె గదిలోకి దూరిన ఓ దుండగుడు బ్యాగ్ను దొంగలించాడు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఈసీబీ, హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంపై మండిపడింది. 'లండన్ మైదా వాలే మారియట్ హోటల్ మేనేజ్మెంట్ తీరు నన్ను షాక్కు గురి చేసింది. నేను భారత క్రికెట్ జట్టుతో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తి నా రూమ్లోకి దూరి బ్యాగు దొంగిలించారు. ఇందులో డబ్బు, కార్డుల, వాచీలు, జ్యూవెలరీ కూడా ఉన్నాయి. ఇక్కడ ఏ మాత్రం సురక్షితంగా లేదు. దీనిపై వెంటనే విచారణ చేసి నా బ్యాగును తిరిగి అందిస్తారని ఆశిస్తున్నా. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, తమ దేశంలో పర్యటించే క్రికెటర్లకు ఇలా భద్రత లేని హోటళ్లలో బస కల్పిస్తారని అనుకోలేదు. నా బ్యాగును త్వరగా తెచ్చి ఇవ్వండి.' అంటూ వరుస ట్వీట్లు చేసింది తానియా భాటియా.
వన్డే సిరీస్లో ఇంగ్లండ్ జట్టు క్లీన్ స్వీప్ అయిన తర్వాత ఈ సంఘటన జరగడంతో ఎవరో కావాలనే ఈ పనికి పాల్పడి ఉంటారని అభిమానులు అనుమానిస్తున్నారు. టీమిండియా గెలవడాన్ని తట్టుకోలేక ఇంగ్లండ్ అభిమానులు చేతికి పని చెప్పి ఉంటారని ఆరోపిస్తున్నారు. మరికొందరు లండన్లో పోయిన వస్తువులు తిరిగి మ్యూజియంలోనే దొరుకుతాయని, అప్పుడు కోహినూర్ డైమండ్ని కొట్టేసి మ్యూజియంలో దాచి పెట్టినట్టే... తానియా పర్సు కూడా ఎప్పుడో ఒక్కప్పుడు అక్కడికి చేరుతుందని సెటైర్లు పేల్చుతున్నారు. ఇంగ్లండ్తో జరిగిన వన్డే సిరీస్లో తానియా భాటియాకు బదులుగా యష్తికా భాటియాని ఆడించింది టీమిండియా. వచ్చే నెలలో ఆరంభం కానున్న ఆసియా కప్ 2022 మహిళల టోర్నీకి ప్రకటించిన జట్టులోనూ వికెట్ కీపర్ తానియా భాటియాకి చోటు దక్కింది.