ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ మరో విజయం సాధించింది. గ్రూప్-సీలో భాగంగా అరుణాచల్ ప్రదేశ్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. స్పిన్నర్ తనయ్ త్యాగరాజన్(5/32) ఐదు వికెట్లతో హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ 28.3 ఓవర్లలో 96 పరుగులకు కుప్పకూలింది. తనయ్ త్యాగరాజన్తో పాటు అనికేత్ రెడ్డి(4/14) నాలుగు వికట్లతో అరుణాచల్ ప్రదేశ్ పతనాన్ని శాసించాడు. చామ మిలింద్ ఓ వికెట్ పడగొట్టాడు.

అనంతరం బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 12 ఓవర్లలోనే 2 వికెట్లకు 100 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. తన్మయ్ అగర్వాల్(22), పీ నితేష్ రెడ్డి(29 నాటౌట్), కొడిమెల హిమతేజ(21 నాటౌట్) రాణించారు. కెప్టెన్ తిలక్ వర్మ బ్యాటింగ్కు రాలేదు. గ్రూప్-సీలో ఉన్న హైదరాబాద్ 7 మ్యాచ్ల్లో 4 గెలిచి నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
మరో మూడు మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఈ గ్రూప్లో పంజాబ్ 7 మ్యాచ్ల్లో 6 గెలిచి అగ్రస్థానంలో ఉండగా.. కర్ణాటక సైతం 6 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ముంబై ఐదు విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో హైదరాబాద్ నాకౌట్ చేరే అవకాశాలు లేవు.
విజయ్ హజారే ట్రోఫీ ఫార్మాట్ ఏంటంటే..?
మొత్తం 38 జట్లను ఐదు గ్రూప్లుగా విభజించారు. ప్రతీ గ్రూప్లో టాప్-2లో నిలిచే జట్లు నాకౌట్ మ్యాచ్లు ఆడుతాయి. టాప్ ప్లేస్లో నిలిచిన జట్లు 1-5 ర్యాంకిస్తారు. రెండో ప్లేస్లో ఉన్న జట్లు 6-10 ర్యాంక్స్ ఇస్తారు. టాప్-6లో ఉన్న జట్లు నేరుగా క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఆడనుండగా.. 7-10లో నిలిచి టీమ్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్ ఆడుతాయి.