
చెన్నై: దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రల పోలీసులు వినూత్న పద్దతిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా సామాజిక
దూరం పాటించాలనే విషయం చెబుతూ.. బ్యానర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇవేవి పట్టించుకోకపోవడంతో మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. దీంతో క్రికెట్కు ఉన్న క్రేజ్ను క్యాచ్ చేసుకుంటూ ఆటగాళ్ల ఫొటోలతో అవగాహన కల్పిస్తున్నారు.
తమిళనాడులోని తిరుప్పూర్ సిటీ పోలీసులు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఫొటోతో పాటు పేరుని కూడా సోషల్ మీడియాలో.. సామాజిక దూరంపై అవగాహన కోసం ఉపయోగిస్తున్నారు. ధోనీ, రోహిత్ శర్మ మైదానంలో కాస్త దూరంగా నడుస్తున్న ఫొటోను ట్విటర్లో షేర్ చేసిన పోలీసులు.. M S D-maintain social distance అని ధోనీ పేరుకి కొత్త అర్థాన్ని తెరపైకి తీసుకొచ్చారు.
ఇక తమిళనాడులో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోనీ పిచ్చ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. తాల అంటూ తమిళ అభిమానులు అతన్ని ముద్దుగా పిలుచుకుంటారు. ఇప్పటికే చెన్నైకి మూడు సార్లు టైటిల్ అందించాడు.