
హైదరాబాద్: వెస్టిండీస్ యువ ప్లేయర్, దిగ్గజ క్రికెటర్ శివ్ నరేన్ చంద్రపాల్ తనయుడు తేజ్నరేన్ చంద్రపాల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్లో తేజ్నరేన్ చంద్రపాల్(467 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్లతో 207 నాటౌట్) డబుల్ సెంచరీతో చెలరేగాడు. తేజ్నరేన్కు ఇది తొలి డబుల్ సెంచరీ కాగా.. ఈ ఇన్నింగ్స్తో అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే డబుల్ సెంచరీలు బాదిన తండ్రీ కొడుకులుగా ఈ ఇద్దరూ నిలిచారు. క్రికెట్ చరిత్రలోనే ఏ తండ్రీ కొడుకులు కూడా ఈ ఘనతను అందుకోలేదు.
భారత్కు చెందిన తండ్రి కొడుకులు లాలా అమర్నాథ్-మొహిందర్ అమర్నాథ్, విజయ్ మంజ్రేకర్-సంజయ్ మంజ్రేకర్, ఇఫ్తికార్(ఇంగ్లండ్)-మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ టెస్ట్ల్లో సెంచరీలు చేసినప్పటికీ తండ్రి కొడుకుల ఇద్దరూ డబుల్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. అంతేకాకుండా అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్ విభాగంలో తేజ్నరేన్.. తండ్రి శివ్ నరేన్ను మించిపోయాడు. శివ్ నరేన్ 164 టెస్ట్ల్లో 203 నాటౌట్తో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేయగా.. తేజ్ నరేన్ తన మూడో టెస్ట్లో తండ్రి వ్యక్తిగత స్కోర్ను అధిగమించాడు. దాంతో అయ్యను మించిన కొడుకు అంటూ తేజ్ నరేన్పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
శనివారం ప్రారంభమైన ఈ టెస్ట్లో ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. తొలి ఇన్నింగ్స్ను 447/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. తేజ్నరేన్ చంద్రపాల్(467 బంతుల్లో 16 ఫోర్లు, 3 సిక్స్లతో 207 నాటౌట్) డబుల్ సెంచరీకి తోడుగా ఓపెనర్ క్రైగ్ బ్రాత్ వైట్(312 బంతుల్లో 18 ఫోర్లతో 182) రాణించాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన జింబాబ్వే మూడో రోజు ఆట ముగిసే సమయానికి 26 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది.