
న్యూఢిల్లీ: అప్కమింగ్ టీ20 ప్రపంచకప్లో టీమిండియా మెంటార్గా సేవలందించేందుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సెక్రటరీ జై షా వెల్లడించాడు. భారత జట్టుకు సేవలందించడం తన బాధ్యతగా భావిస్తానని, మెంటార్గా తనకు ఎలాంటి ఫీజు అక్కర్లేదని ధోనీని సంప్రదించినప్పుడే స్పష్టం చేశాడని జై షా పేర్కొన్నాడు. దేశం కోసం ధోనీ తీసుకున్న ఈ నిర్ణయం గొప్పదని ప్రశంసించాడు. తాజాగా ఏఎన్ఐతో మాట్లాడిన జై షా ఈ విషయాన్ని వెల్లడించాడు.
'టీ20 ప్రపంచకప్లో టీమిండియా మెంటార్గా సేవలందించేందుకు ధోనీ నయా పైస కూడా తీసుకోవడం లేదు. మెంటార్గా ధోనీని ఎంపిక చేయడం టీమిండియాకు కచ్చితంగా లాభిస్తుంది. . భారత టీ20 ప్రపంచకప్ జట్టులోని సభ్యులందరికీ ధోనీ అంటే అమితమైన గౌరవముంది. కొత్త బాధ్యతల్లో ధోనీ తప్పక రాణిస్తాడు. అతని పర్యవేక్షణలో భారత జట్టు మరో ప్రపంచకప్ గెలవాలని
యావత్ భారత దేశం ఆకాంక్షిస్తుంది.'అని జైషా చెప్పుకొచ్చాడు.
ధోనీది మామూలు బుర్ర కాదని భారత మాజీ చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. ఈసారి ధోనీ, కోహ్లీ అద్భుతాలు చేస్తారని అతను ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఎంఎస్కే ప్రసాద్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'టీ20 ప్రపంచకప్ కోసం ఎంఎస్ ధోనీని మెంటార్గా ఎంపిక చేసి బీసీసీఐ మంచి పని చేసింది. బీసీసీఐ సెలెక్టర్లు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా. ఈ నిర్ణయం బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్మెంట్, టీమిండియా కలిసే తీసుకుని ఉంటారు. 200 కంటే ఎక్కువ ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన అనుభవం, 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ వంటి పెద్ద టోర్నమెంట్లను గెలిచిన అనుభవం ఉన్న ఆటగాడు టీమిండియాకు మెంటార్గా పనిచేయడం ఎంతో కీలకం కానుంది. నేను ఈ నిర్ణయాన్ని పూర్తిగా గౌరవిస్తాను. చాలా సంతోషంగా ఉంది. టీమిండియాకు మెంటర్గా పనిచేయడానికి ధోనీ కంటే మెరుగైన వ్యక్తి మరొకరు ఉండరు' అని అన్నాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2021 సీజన్లో బిజీగా ఉన్న ధోనీ.. చెన్నై సూపర్ కింగ్స్కు టైటిల్ అందించే పనిలో పడ్డాడు. ఇప్పటికే క్వాలిఫయర్-1లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించిన సీఎస్కే ఫైనల్ చేరి టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. బుధవారం కేకేఆర్, ఢిల్లీ మధ్య జరిగే క్వాలిఫయర్-2లో గెలిచే జట్టుతో టైటిల్ ఫైట్కు సిద్దమవుతోంది. ఇక ఐపీఎల్ ముగిసిన వెంటనే యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్ 2021 ప్రారంభంకానుంది. మెగా టోర్నీ కోసం యునైటెడ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. అక్టోబర్ 17న ఓమన్ వేదికగా క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానుండగా.. అక్టోబర్ 23 నుంచి సూపర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. పొట్టి ప్రపంచకప్లో భాగంగా అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది.