ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరిగిన సూపర్-8 పోరులో సమష్టిగా రాణించిన ఇంగ్లండ్ 51 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ విల్ జాక్స్(21, 3/22) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 146 పరుగులే చేసింది. ఫిల్ సాల్ట్(40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లతో 62) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివర్లో విల్ జాక్స్(14 బంతుల్లో 4 ఫోర్లతో 21) విలువైన పరుగులు జోడించడంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని అందుకుంది.
ఇంగ్లండ్ బ్యాటింగ్లో ఏ జోడీ కూడా కనీసం 30 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయలేదు. స్లో వికెట్పై పరుగులు చేసేందుకు ఇంగ్లండ్ బ్యాటర్లు తడబడ్డారు. శ్రీలంక బౌలర్లలో దునిత్ వెల్లలేగ(3/26) మూడు వికెట్లు తీయగా.. దిల్షాన్ మధుషంక(2/25), మహీష్ తీక్షణ(2/21) రెండేసి వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు. దుష్మంత్ చమీరాకు ఒక వికెట్ దక్కింది.

147 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ఈజీగా ఛేదిస్తుందని, ఇంగ్లండ్కు ఘోర ఓటమి తప్పదని అంతా అనుకున్నారు. కానీ విల్ జాక్స్(3/22) మూడు వికెట్లతో విజృంభించడంతో శ్రీలంక 16.4 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కెప్టెన్ డసన్ షనక(24 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 30) ఒక్కడే రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. పవర్ ప్లేలోనే శ్రీలంక 34/5 ఐదు వికెట్లు కోల్పోయింది. జోఫ్రా ఆర్చర్(2/20), లియామ్ డాసన్(2/27), ఆదిల్ రషీద్(2/13) రెండేసి వికెట్లు తీసాడు. జేమీ ఓవర్టన్(1/13) ఒక వికెట్ దక్కింది.
ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ హాఫ్ సెంచరీతో పాటు విల్ జాక్స్ ఆల్రౌండ్ షో ఇంగ్లండ్ విజయానికి కలిసొచ్చింది. ఈ గెలుపుతో ఇంగ్లండ్ తమ సెమీస్ అవకాశాలను మెరుగుపర్చుకోగా.. శ్రీలంక సంక్లిష్టంగా మార్చుకుంది. శ్రీలంక సెమీస్ చేరాలంటే తమ తదుపరి రెండు మ్యాచ్లకు రెండింటిని మెరుగైన రన్రేట్ గెలవాలి. లేదంటే సెమీస్ అవకాశాలు గల్లంతవుతాయి.