ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న సూపర్-8 పోరులో టీమిండియా టాస్ ఓడి ఫీల్డింగ్కు దిగింది. అయితే ఈ మ్యాచ్లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా గత కాంబినేషన్తోనే బరిలోకి దిగుతోంది. దాంతో వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్పై వేటు పడింది. అయితే ఇది వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయమని టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ సందర్భంగా వెల్లడించాడు. సౌతాఫ్రికా బ్యాటింగ్ లైనప్లో లెఫ్టార్మ్ బ్యాటర్లు ఎక్కువగా ఉండటంతోనే అక్షర్ పటేల్ను పక్కన పెట్టాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు.
'టాస్ గెలిస్తే మేం కూడా ముందుగా బ్యాటింగ్ చేయాలనుకున్నాం. కానీ ముందుగా బౌలింగ్ చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రెండు రోజుల క్రితం ఇక్కడ మ్యాచ్ ఆడాం. ఆ మ్యాచ్లో మా ప్రత్యర్థి ముందుగా బౌలింగ్ చేసినప్పుడు వారికి వికెట్ నుంచి కొంత సహకారం లభించింది. మేం కూడా ఆ అడ్వాంటేజ్ను ఉపయోగించుకుంటాం. ఇదో బిగ్ మ్యాచ్. జట్టులోని ప్రతీ ఒక్కరు సత్తా చాటి వారిని వారు నిరూపించుకోవడానికి ఇదొక గొప్ప సందర్భం.
ఈ మ్యాచ్తో ప్రేక్షకులకు అసలు సిసలు మజా అందనుంది. మెగా టోర్నీ కీలక దశకు చేరుకుంది. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాలి. మాకు ఇంకా రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నప్పటికీ, తొలి బంతి నుంచే ఆధిపత్యం ప్రదర్శించడం కీలకం. అందుకు ఈ మ్యాచ్ సరైనదని భావిస్తున్నా.

గత మ్యాచ్ల తరహాలోనే మైదానంలో గొప్ప ప్రదర్శనను కనబరుస్తాం. ఫలితం ఎలా ఉన్నా స్వీకరిస్తాం. పిచ్ మేం గత మ్యాచ్లో ఆడిన నల్ల మట్టి వికెట్ లాగే ఉంది. కేవలం ఒక పక్కన ఉన్న స్ట్రిప్ మాత్రమే మారింది. పెద్దగా మార్పు లేదు. మేము ముందుగా బౌలింగ్ చేయడానికి సంతోషంగా ఉన్నాం. అక్షర్ పటేల్ను పక్కన పెట్టడం బాధాకరమే, కానీ మేం అదే జట్టుతో ముందుకు వెళ్తున్నాము. ఇది కేవలం వ్యూహాత్మక నిర్ణయం మాత్రమే. గత మ్యాచ్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.'అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
మరోవైపు టాస్ గెలిచిన ఎయిడెన్ మార్క్రమ్ పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే బ్యాటింగ్ ఎంచుకున్నానని తెలిపాడు. 'మేం ముందుగా బ్యాటింగ్ చేస్తాం. గతంలో మేం చూసిన వికెట్ కంటే ఇది చాలా పొడిగా ఉంది. కాబట్టి ఆరంభంలో బంతి ఆగుతూ వస్తుందని మేం అనుకోవడం లేదు. మ్యాచ్ మొత్తం ఈ పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాం. భారీ స్కోర్ చేయాలని భావిస్తున్నాం.
మా కుర్రాళ్లందరూ మంచి ఫామ్లో ఉన్నారు. ఆ ఫామ్, ఆత్మవిశ్వాసాన్ని కొనసాగించడానికి ఆటగాళ్లు తెరవెనుక చాలా కష్టపడుతున్నారు. మేం ఇప్పటికే ఇక్కడ రెండు మ్యాచ్లు ఆడాం. అయితే ఈ పిచ్ కాస్త భిన్నంగా ఉంది. నల్ల మట్టితో కూడిన వికెట్ ఇది. కానీ సాధారణంగా ఇది భారీ స్కోర్లు నమోదయ్యే మైదానం. వినోదాన్ని పంచే వేదిక. ఆటగాళ్లుగా మేము అలాంటి వాటిలో భాగం కావాలనే కోరుకుంటాం. ఈ రాత్రి కూడా అంతకు భిన్నంగా ఉండదని ఆశిస్తున్నాను. గత మ్యాచ్ నుంచి మేం నాలుగు మార్పులు చేసి.. మా రెగ్యులర్ ప్లేయింగ్ ఎలెవన్తో బరిలోకి దిగుతున్నాం . కేశవ్ మహారాజ్, లుంగి ఎన్గిడి, మార్కో జాన్సెన్, డేవిడ్ మిల్లర్ తిరిగి జట్టులోకి వచ్చారు.'అని మార్క్రమ్ చెప్పుకొచ్చాడు.
భారత్ : అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (కీపర్), తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.
సౌతాఫ్రికా: ఎయిడెన్ మార్క్రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (కీపర్), రియాన్ రికెల్టన్, డేవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కోర్బిన్ బాష్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి ఎన్గిడి.